వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన పినిపే విశ్వరూప్ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గెలిరు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావుపై ఈయన 25,654 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు జాడల్లో నడిచిన విధేయుడు. ఇదే ఆయనకు మరోసారి మంత్రి పదవి వరించేలా చేసింది. 2009 లో రెండోసారి ఏర్పాటైన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో తొలిసారి మంత్రిపదవి చేపట్టారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిపదవి చేపట్టబోతున్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఓసారి మంత్రి పదవి చేపట్టిన ఎస్సీ నాయకుడు ఈయనే. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో విశ్వరూప్ 1989లో రాజకీయ అరంగ్రేటం చేశారు. 1998లో ముమ్మిడివరం నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, లోక్సభ మాజీసభాపతి దివంగత జీఎంసీ బాలయోగిపై పోటీచేసి ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి చెల్లి వివేకానందపై మరోసారి పరాజితులయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి విశ్వరూప్ అదే పార్టీ టికెట్తో పోటీ చేసి ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు నాలుగున్నరేళ్లపాటు ముగ్గురు ముఖ్యమంత్రులు దివంగత వైఎస్సార్, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ మరణంతరం జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ వైపు పయనించారు. జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు ఆరునెలలముందే తన మంత్రిపదవికి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు.ఈయనను సాంఘిక సంక్షేమం మంత్రిగా నియమించారు.