ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామన్ మ్యాన్ లా చెకప్ చేయించుకునే ఫొటోపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడనుంచి హైదరాబాద్ వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయ అధికారులు సాధారణ ప్రయాణికుడిలా ట్రీట్ చేశారు. మెటల్ డిటెక్టర్ మార్గంలోనే ఆయన విమానాశ్రయం లాంజ్లోకి వెళ్లారు. అక్కడి విమానాశ్రయ భద్రతా సిబ్బంది చంద్రబాబును మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేశారు. తర్వాత చంద్రబాబు సాధారణ ప్రయాణికులతో కలసి, వారు ప్రయాణించిన బస్సులోనే వెళ్లి విమానంఎక్కారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రొటోకాల్ ద్వారా నేరుగా విమానం వద్దకు కాన్వాయ్లో వెళ్లేవారు. అయితే ఇప్పుడు విమానాశ్రయ భద్రతాధికారులు దానికి అనుమతించకపోవడంతో ప్రతిపక్షనేగా చంద్రబాబు సాధారణ ప్రయాణికుల మార్గంలో వెళ్లారు.
సీనియర్ నాయకుడు, సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబును విమానాశ్రయ సిబ్బంది, భద్రత అధికారులు ఒక సాధారణ ప్రయాణికుడిలా తనిఖీలు చేయడం పట్ల టీడీపీ శ్రేణులు, ఆయన అనుకూల మీడియా పెద్దఎత్తున రాద్దాంతం చేస్తోంది. జెడ్ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తిని ఇతర ప్రయాణికులతో కలిపి బస్సులో పంపించడం ఎంత వరకు సమంజసమని, భద్రతా సమస్యలు తలెత్తితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. తాజా ఘటన పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనవసర ఆందోళన చేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఇదేవిధంగా చెక్ చేసేవారు.
కానీ ఏరోజూ ఆయన అభిమానులు ఇలా ఆందోళన చెందలేదు. అధికారంలో ఉన్న సీఎంలకు, సుప్రీంకోర్ట్ జస్టిస్ లకు, కేంద్రమంత్రులకు ఇలా కొందరికి మాత్రమే నేరుగా విమానం వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నేతకు ఎక్కడా ఇలాంటి వెసులుబాటు ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. జగన్ ని చెకింగ్ చేసినపుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి.. ఏ అంటూ వైసీపీనేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే గతంలో ఎప్పుడూ జగన్ ని ఇలా చెక్ చేయలేదని చెప్తూ టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుండగా వైసీపీ శ్రేణులు జగన్ ని చెక్ చేసిన ఫొటోలు క్షణాల్లో అప్ లోడ్ చేసి టీడీపీ సోషల్ మీడియా నోరు మూయించారు.