తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో కోడెల శివప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు శివరాంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో తన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అరాచకాలు, అక్రమ వసూళ్లకు కోడెల శివప్రసాదరావు అండగా నిలిచినట్లు మరోమారు తేటతెల్లమైంది. కోడెల కుమారుడు, కుమార్తెపై గతంలో నమోదైన కేసుల్లో శివప్రసాదరావును సైతం నిందితుడిగానే చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత కోడెల కుటుంబం వల్ల నష్టపోయిన వారంతా ధైర్యంగా ముందుకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై గళం విప్పుతున్నారు. నేరుగా పోలీసు స్టేషన్లకు వెళ్లి, కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా స్పోర్ట్స్ కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షల వసూలు చేసిన కోడెల శివరాం ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడని ఆంధ్ర రంజీ జట్టు క్రీడాకారుడు బుడుమూరు నాగరాజు శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట డీఎస్పీ రామవర్మకు ఫిర్యాదు చేశాడు. కోడెల కుటుంబంపై ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసులు చూసి తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2వ తేదీన నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అక్కడ నాగరాజుపై కోడెల అనుచరులు దాడి చేశారు. బలవంతంగా బాండ్ పేపరు లాక్కొని చించేశారు. తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు చెప్పడంతో శుక్రవారం డబ్బులు తిరిగి ఇస్తానని అతడిని నరసరావుపేటకు రప్పించారు. గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని నాగరాజుకు చెప్పారు. గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నాగరాజు చివరకు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీని కలిసి, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. బాధితుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కోడెల శివప్రసాదరావు, కోడెల శివరాంలపై చీటింగ్, ఫోర్జరీ డాక్యుమెంట్ తయారీ, సెక్షన్ 420, 468, 472, 477, 387, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట టూటౌన్ సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు.