తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ఆ పార్టీకి గుడ్బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.తాము పార్టీ మారుతున్న విషయాన్ని పేర్కొంటూ.. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. వీరు పార్టీ మారిన కాసేపటికే రాజ్యసభ వెబ్సైట్లో ఈ నలుగురిని బీజేపీ ఎంపీలుగా అధికారులు మార్చేశారు.బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మోదీ నివాసానికి వెళ్లిన నేతలు, ప్రధానితో భేటీ అయ్యారు.
ఇదిలాఉండగా, నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీమారడంపై టీడీపీ ఎంపీలు నలుగురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్,తోట రామలక్ష్మి, గల్లా జయదేవ్,కేశినేనిలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ టీడీపీని బీజేపీలో విలీనం చేసే అధికారం ఛైర్మన్ పరిధిలో ఉండదని, ఈ అంశం ఎన్నికల సంఘం పరిధిలో మాత్రమే ఉంటుందన్నారు. రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఎట్టిపరిస్థితిలోనూ చెల్లదని ఎంపీలు తెలిపారు.అయితే వీరు బీజేపీలో కలుస్తున్నారని తెలిసిన 24గంటల వరకు పట్టించుకోని నాయకుల ఆ తరువాత ఫిర్యాదు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.