తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ఆ పార్టీకి గుడ్బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.తాము పార్టీ మారుతున్న విషయాన్ని పేర్కొంటూ.. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా.. ఇప్పుడు టీడీపీలోని సీనియర్ నేతలందరూ పార్టీని వీడుతున్నారు. నలుగురు రాజ్యసభ ఎంపీలు కాషాయ కండువాను కప్పుకొన్న రీతిలోనే మరికొందరు నేతలు సైతం తమ దారి తాము చూసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా, ఈ పరిణామం నేపథ్యంలో ఓ సీనియర్ నేత చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ బ్రోకర్లను పక్కన పెట్టుకోవడంతోనే పార్టీ దారుణంగా ఓడిపోయిందని అన్నారు. సొంత లాభం కోసమే కొందరు పార్టీ మారుతున్నారని వరదరాజులు రెడ్డి విమర్శించారు. సీఎం రమేష్ ఓ పొలిటికల్ బ్రోకర్.. తన ప్రయోజనాల కోసమే అతడు పార్టీ మారాడని మండిపడ్డారు. కడప జిల్లాలో టీడీపీ దారుణ ఓటమికి సీఎం రమేష్నే కారణమని వరదరాజుల రెడ్డి ఫైర్ అయ్యారు. బాబుకు రాజకీయ బ్రోకర్లే అవసరమా అని ప్రశ్నించారు.