పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా టీడీపీ గాలి వీచిన సమయంలోనూ ఉండిలో వైసీపీకి పెద్దఎత్తున ఆదరణ కనిపించింది. కచ్చితంగా ఉండి సీటు వైసీపీ కైవసం చేసుకుంటందనే అంచనాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజును నరసాపురం పార్లమెంట్ స్థానానికి పంపి ఉండి సీటును ఆయన తమ్ముడు మంతెన రామరాజు(రాంబాబు) కు ఇచ్చారు. ఈ నేపధ్యంలో భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి పీవీఎల్ నరసింహరాజు గెలుస్తారని అంతా భావించారు. కానీ పలు రాజకీయ సమీకరణాలు, సామాజిక కారణాలు, బెట్టింగులు, ఇతర ప్రోపగాండతో వైసీపీ అతితక్కువ ఓట్లతో ఓటమిపాలైంది. అయితే ఈ టీడీపీ సీటు గెలుపు పట్ల స్థానిక కార్యకర్తలు విర్రవీగారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఘోర ఓటమి పట్ల ఓర్చుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఈనెల 20వ తేదీన ఉండిలో వివాహానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.
సీఎంకు స్వాగతం పలుకుతూ ఎస్సీ, బీసీ కాలనీలకు చెందిన యువకులు ఫెక్సీలు ఏర్పాటు చేసారు. అయితే వీటిని చూసి ఓర్చుకోలేని ఉండికి చెందిన బురిడి రవి, కిన్నెర వెంకన్న, పాలపర్తి బాలాజీ అనే టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో ఆ ప్లెక్సీలను చించివేసారు. ఈ ఘటనను చూసిన పెదపూడి చినబాబు అనే వ్యక్తి వారిని వారించినా వినలేదు. అందరినీ పిలిచే ప్రయత్నం చేసేలోపే పిరికిపందలైన టీడీపీ కార్యకర్తలు పారిపోయారు. అనంతరం మరికొందరు యువకులతో కలిసి వారిపై కేసులు నమోదు చేసారు. అయితే సాక్ష్యాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు చించడంపై వారిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. వైసీపీకి చెందిన కార్యకర్తలు మాత్రం వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులకు గురిచేసారని, ఇప్పటికీ టీడీపీ నేతల తీరు మారకపోతే కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు.