ఏపీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సీఎం జగన్ ఆదేశాలతో ప్రభుత్వం దృష్టిసారించింది. ముఖ్యంగా రాజధానిలోని కృష్ణానది కరకట్ట లోపలి అక్రమ కట్టడాల కూల్చివేత స్టార్ట్ అయ్యింది. కరకట్ట వెంబడి అక్రమంగా నిర్మించిన కట్టడాలపై సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే కొరడా ఝుళిపింస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అద్దెకుంటున్న లింగమనేని ఎస్టేట్స్ తో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటన్నింటికీ నోటీసులు జారీ చేసారు. నదీతీరానికి వంద మీటర్ల లోపు ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వ్యతిరేకించినవేనని, వరద నీటి మట్టానికి దిగువన ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి వాటిని 58కి పైగా గుర్తించి వాటిపై సుదీర్ఘ కసరత్తు చేసింది.
వీటిలో 28 అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. బ్యారేజీ దిగువన ఉన్న లోటస్ హోటల్తో పాటు ఫిషర్మెన్ అసోసియేషన్ భవనం, చందన కేదారేశ్వరరావు గెస్ట్హౌస్, శ్రీరెడ్డి గెస్ట్ హౌస్, మాజీఎంపీ బీజేపీ నాయకుడు గోకరాజు గంగరాజుకు చెందిన గెస్ట్ హౌస్, సాగర్ మినరల్ వాటర్ ప్లాంట్ పేరుతో నిర్మించిన డాక్టర్ సురేంద్ర గెస్ట్ హౌస్, సత్యానంద ఆశ్రమం, ఆక్వా డేర్ డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హేచరీస్, తులసి గార్డెన్స్, వేదాద్రిమహర్షి తపోవనం, లింగమనేని ఎస్టేట్స్ కు చెందిన ప్రజావేదిక, మాగంటి ప్రసాద్, ముక్కామల అప్పారావు గెస్ట్హౌస్, సిటీ కేబుల్ మధుసూదనరావు బిల్డింగ్, ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ ఆడిటోరియం, మందడంలోని ఫిషర్మెన్ సెటిల్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో 50హట్స్, 5 పక్కా భవనాలు, మందడం, తుళ్లూరులోని మరో రెండు అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులు అందించారు.
వీటిపై వారంలోపు వివరణ ఇవ్వాలని, సంజాయిషీ సరిగ్గా లేకపోతే వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన కరకట్ట ఆపరేషన్ పై రాజకీయం రాజుకుంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నవారు మాత్రం మొత్తం కధ తెలుసుకోవాలి