అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఏపీ, తెలంగాణ బీజేపీ ఇన్చార్జి రాంమాధవ్ సమక్షంలో సూర్యనారాయణ బీజేపీలో చేరారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం.. టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ఆయన పార్టీలో ఇమడలేకపోయారు. ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కార్యకర్త మృతిచెందడంతో సూర్యనారాయణ కలత చెందారు. ఈనేపథ్యంలో పార్టీని వీడుతున్నారు.
పార్టీ మారుతున్నారనే వార్తలు గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో ఫోన్ మాట్లాడినా ఫలితం లేదు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథితోపాటు మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి తదితరులు మాట్లాడినా పట్టించుకోలేదు.. పార్టీ మార్పుపై తన ఆలోచన గురించి కార్యకర్తలతో చర్చించుకుని మరీ ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం దేశం బీజేపీ పాలనలో అభివృద్ధిలో దూసుకెళ్తుందని, పార్టీలో చేరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కార్యకర్తలనుంచి డిమాండ్ రావడంతో తాను ఎట్టకేలకు బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మొదట సూరి పరిటాల రవీంద్రకు సన్నిహితుడు.. 2009లో ధర్మవరం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
తరువాత 2014లో ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. బలమైన నాయకుడిగా పేరుతెచ్చుకున్న సూరి తొమ్మిదేళ్లుగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2014లో జిల్లాలో టీడీపీకి 12 స్థానాలు వచ్చేలా కృషి చేశారు. ప్రస్తుతం బీజేపీలో చేరిన ఆయన మరింత పట్టు సాధించే ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి. పార్టీ కూడా కీలక బాధ్యతలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల్లో మరింత అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ మనుగడ కష్టమని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. కారణం పరిటాల శ్రీరామ్, జేసీలు ఓడిపోవడం, పార్టీ పటిష్టతకు పనిచేసేవారు లేకపోవడమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.