ప్రముఖనటి, దర్శకనిర్మాత విజయనిర్మల ఈనెల 27వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోక సంద్రంలో ముగినిపోయారు. గత 50ఏళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉన్నారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిచేసి వెళ్లిపోవడంతో ఆ బాధను ఆయన తట్టుకోలేక కన్నీమున్నీరయ్యారు. అయితే భార్య విజయ నిర్మలను కోల్పోయి బాధలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణను టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన కొడుకు నారా లోకేష్, గల్లా జయదేవ్, చంద్రబాబు భార్య భువనేశ్వరితో కలిసి ఆదివారం హైదరాబాద్ నానక్రామ్ గూడలోని కృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాసేపు మహేష్ బాబు, విజయనిర్మల తనయుడు నరేష్ లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణ ఇంటిని కొడుకు నరేష్ చూపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు షాకయ్యారు. ఇంట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో చూసి చంద్రబాబు లోకేశ్ ఖంగుతిన్నారు. చూస్తూ అలా ఉండిపోయారే తప్ప కనీసం కిమ్మనలేదు. అయితే కృష్ణ కుటుంబానికి వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దూకుడు ఆడియో ఫంక్షన్ లో కూడా ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లా వైఎస్ ఎలాగోలా బ్రతికి రావాలని కోరుకున్నారు.
ఇప్పుడు చంద్రబాబుకు ఇల్లు చూపిస్తున్నపుడు కూడా మహేశ్ అమ్మకు వైఎస్సార్ అంటే ప్రాణం.. ఆయనను చాలాసార్లు కలిసారు అని చెప్పారట. దీంతో చంద్రబాబు ఏం మాట్లాడలేకపోయారట. అలాగే విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వైఎస్ఆర్ ఫోటోను చూసి ఆశ్చర్యపోయారు. విజయనిర్మల పార్థీవదేహానికి నివాళులర్పించిన అనంతరం జగన్ కు ఇంట్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోను చూపించారు. ఆమె తనయుడు నరేశ్ జగన్ తో విజయనిర్మల వైఎస్ఆర్ కు ఎంతో అభిమాని.. అందుకే ఆఫోటో ఎప్పుడూ కనిపించేలా హాల్లో పెట్టారని జగన్కు చెప్పారు. ఈ ఫోటోను చూసిన సీఎం జగన్ ఆశ్చర్యానికి లోనయ్యారట.. జగన్ సీఎం కావాలని విజయనిర్మల ఎంతో కోరుకున్నారని, సీఎం అయిన తర్వాత కలవాలనుకున్నారని జగన్కు నరేశ్ తెలిపారు. ఈలోపే ఇలా జరిగిపోయిందని ఫీలయ్యారు. నరేశ్ను జగన్ ఓదార్చారు.