ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నెలరోజుల పాలన హిట్టా.? ఫట్టా.? సీఎంగా జగన్ పనితీరు ఎలాఉంది? వాస్తవానికి మొత్తం 60నెలల పదవీ కాలంలో నెల రోజులనే ప్రామాణికంగా తీసుకుని మార్కులు వేయాల్సిన అవసరం లేదు. కానీ మొదటి నెల కాబట్టి సర్వత్రా జగన్ పనితీరుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారని మాత్రం చెప్పవచ్చు. పింఛన్ల పెంపు మీద తొలి సంతకం, ప్రస్తుతం ఇస్తున్న రూ.2వేల పింఛన్ను రూ.2250కి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, ప్రతి ఏటా పెంచుతూ దాన్ని రూ.3000కు పెంచుతామనడం, తర్వాత సీఎం చాంబర్లో బాధ్యతలు స్వీకరించాక ఆశావర్కర్ల వేతనాల పెంపు ఫైల్ మీద సంతకం వంటి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యశ్రీ, 108 కు పూర్వ వైభవం, గ్రామ వలంటీర్ల నోటిఫికేషన్, ప్రభుత్వ పధకాలు డోర్ డెలివరీ, సన్న బియ్యం, స్కూల్ పిల్లలకు అక్షయపాత్ర, అమ్మఒడి పధకం.. ఇలా నెలరోజులకే తాను ప్రజల పక్షపాతినని నిరూపించుకున్నారు.
అలాగో మరోవైపు తనపని తాను చేసుకుంటనే రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కొత్తనిర్ణయాలు తీసుకుంటున్నారు. నదీ జలాల వినియోగంలో అంగీకారానికి వచ్చారు. పోలవరం డీపీఆర్కు ప్రధాని మోడి ఆమోదముద్ర వేసారు. పోలవరంపై వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవటానికి కేసీఆర్ అంగీకరించారు. అలాగే గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీయటానికి జగన్ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేసారు. కరకట్టపై అక్రమ నివాసాలను కూల్చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చంద్రబాబు నిర్మించిన ప్రజా వేదికను కూల్చేసి ఇప్పుడు చంద్రబాబుకు ఉంటున్న నివాసానికి నోటీసులిచ్చారు. ప్రజల్లో తన పట్ల పాజిటివ్ ధోరణి పెంచుకొనేలా జగన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ రాజకీయ పరిణామాలను అంచనా వేస్తూ అడుగులు వేస్తున్నారు. కేబినెట్ కూర్పులో తనదైన మార్క్ చూపించారు. దేశ రాజకీయాల్లో ఇదో అరుదైన రాష్ట్ర క్యాబినేట్ గా చెప్పుకుంటున్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలతో దేశ రాజకీయాలకే కొత్త రూట్ చూపించారు. ముఖ్యంగా గ్రామ వాలంటీర్ల నియామకం ద్వారా గ్రామాల్లోని యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంతున్నారు. పెద్దఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.