ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పెదవి విరిచారు. బడ్జెట్ నిరాశపరిచిందని, ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదన్నారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం మొండిచేయి చూపించిందే తప్ప ఈ బడ్జెట్లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదన్నారు.
విశాఖ, విజయవాడ మెట్రో రైలుకు నిధుల విషయంలోనూ తీవ్ర అన్యాయం జరిగిందని, బడ్జెట్లో ఏపీకి ఒరిగింది సున్నా అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఏహామీని నిలబెట్టుకోలేదని పార్లమెంట్ ఆవరణలోనే తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏ పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రశ్నిస్తామని తెలిపారు.