జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం దుమారం రేపుతోంది.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని, అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదన్నారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓడిపోయినా తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. జైల్లో కూర్చొని వచ్చినవాళ్లు హ్యాపీగా ఉంటున్నప్పుడు సత్యం మాట్లాడే తాను ఎందుకు బాధపడాలని జగన్ ని ఉద్దేశించి ఉన్నారు. తాను రాజకీయాలు మాట్లాడట్లేదన్న పవన్ కళ్యాణ్ మొత్తం రాజకీయాలే మాట్లాడారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో జనసేన పార్టీ పెట్టానన్నారు. ఎవరు ఎన్ని దెబ్బలు కొట్టినా వెనకడుగు వేయకూడదన్న కాంక్షతో ఉన్నట్లు తెలిపారు.
ఓటమి తర్వాత ఆ అపజయాన్ని జీర్ణించుకోవడానికి తనకు 15నిమిషాలే పట్టిందన్నారు. అలాగే మనుషుల్ని విడగొట్టి రాజకీయాలు చేయనన్న పవన్ మనుషుల్ని కలిపే రాజకీయాల్లో ఉంటానన్నారు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఏ విధమైన కేసులు ఇంకా నిరూపణ కాని వ్యక్తిపై ఆరోపణలు చేయడం పట్ల వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. సామాన్యులు కూడా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. పదేపదే జనం డబ్బులు తీసుకుని ఓట్లు వేసారని పవన్ ప్రజలను విమర్శించడం ఏమాత్రం సంస్కారం కాదంటున్నారు. అలాగే పవన్ ముందు తనను ఆత్మవిమర్శ చేసుకోవాలని, అలా చేసుకోనంతకాలం అతను నాయకుడు కాలేడని విమర్శిస్తున్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, ప్రజాతీర్పును అగౌరవ పరచినందుకు గానూ ఆయనపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.