తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలు కానున్నది. ఈ క్రమంలో జూలై నెలాఖరులోగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది అని సమాచారం. ఈ మేరకు ఓటర్ల తుదిజాబితా ప్రచురణ తేదీని కూడా నాలుగు రోజులు ముందుకు జరిపింది. 2014లో ఈవీఎంల ద్వారా మున్సిపోల్స్ జరగగా.. ఈసారి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 పురపాలక సంఘాలు, మూడు నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.
ఈ నెల 15 లేదా 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, జూలై 30 లేదా 31వ తేదీన ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది. ఆగస్టు 2న ఓట్ల లెక్కింపు, 4న కొత్త పాలకమండళ్లు కొలువుదీరేలా ఈసీ ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సాధ్యమైనంత త్వరగా ఎలక్షన్లు జరపాలని యోచిస్తున్న ఈసీ.. వార్డుల వారీగా ఓటర్ల తుదిజాబితాను ఈ నెల 14 నాటికి ప్రకటించాలని శనివారం సవరించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 13 తేదీలోపు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసి జాబితాను ఎస్ఈసీకి అందజేసేందుకు మున్సిపల్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.