ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వచ్చాయి. తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని పండుగగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేయగా.. తర్వాత మళ్లీ అంటే దాదాపుగా పదేళ్ల తర్వాత ఆయన జయంతిని పురస్కరించుకొని జులై 8న రైతు దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీఎం వైయస్ జగన్ ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేనిరుణం , చెల్లింపుల అంశాలను ఆరోజుకు సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.
వైయస్ఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆరోజు పండగలా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులకు ప్రభుత్వ రాయితీలు, పెట్టుబడిరాయితీ, పంట బీమా వంటి పథకాల ఫలాలు పక్కాగా అందాలని ఆ బాధ్యత కలెక్టర్లదేనని జగన్ చెప్పారు. రైతు దినోత్సవం కోసం నియోజకవర్గానికి రూ.లక్ష విడుదల చేసింది ప్రభుత్వం. రైతు దినోత్సవం వేడుకలను జగన్ పులివెందులలో ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులకు భరోసా కల్పించే ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు. రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని కోరారు. పులివెందులలో అరటి పరిశోధన కేంద్రానికి జగన్ శంకుస్థాపన చేస్తారన్నారు.
రైతుబీమా పథకంలో ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రూ. 7లక్షల బీమా చెల్లిస్తామని, పలుప్రాంతాల్లో రైతులకు అవసరమైన యంత్రాలు ఇస్తామన్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీప్రకారం ప్రభుత్వం వేరుశనగకు క్వింటాల్కు రూ. 1500మద్దతుధర ప్రకటించారు. వేరుశనగ విత్తనాల కొరతను సరిదిద్దారు. 3.13లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేశామన్నారు. ఉత్తరాంధ్రలోనూ సరిపడ వరి విత్తనాలు సరఫరా చేసినట్లు తెలిపారు. అలాగే సుదీర్ఘ పాదయాత్ర చేసిన 2004ఎన్నికల్లో విజయం సాధించిన రాజశేఖర రెడ్డి సీఎంగా ప్రమాణం చేసినవెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసారని, జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఆయన జయంతిని రైతు దినోత్సవంగా జరపడం సరైందేనని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.