ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి జీఎస్టీ ప్రస్తుత సూపరింటెండెంట్, గతంలో జగన్ ఆస్తుల కేసులో చంద్రబాబు అండతో పైశాచికానందం పోందిన బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేయడంతో ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ అధికారులు హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల గాంధీ నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గాంధీ ఆదాయానికన్నా 288శాతం ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 200 కోట్ల ఉంటుందని అంచనా. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బొల్లినేని 1992 ఏప్రిల్ 27న సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్గా చేరాడు. 2002లో సూపరింటెండెంట్గా పదోన్నతి పొంది హైదరాబాద్ కమిషనరేట్-1లో పోస్టింగ్ పొందారు. 2003 లో డిప్యుటేషన్ పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కి వెళ్లారు. 2004లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వెళ్లి 2017 వరకు విధులు నిర్వహించారు. అనంతరం జీఎస్టీకి బదిలీ అయ్యారు.
అయితే ఆ బదిలీ సైతం నిబంధనలకు అనుగుణంగా జరగలేదట..
2010-19 మధ్య కాలంలో బొల్లినేని గాంధీ తన పేరు మీద తన కుటుంబసభ్యుల పేరు మీద భారీగా స్థిర, చరాస్తులను కూడబెట్టినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు.
2010 జనవరి 1 నాటికి ముందు గాంధీ స్థిర, చరాస్తుల విలువ రూ. 21,00,845గా ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. జూన్ 27, 2019 నాటికి గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ సుమారు రూ. 2,74,14,263కు చేరుకున్నట్లు తేల్చారు.
అలాగే 2010-19 మధ్య కాలంలో గాంధీ, ఆయన కుటుంబసభ్యుల ఆదాయాన్ని రూ. 1,30,07,800లుగా నిర్ధారించారు. దీంతో శ్రీనవాస గాంధీపై సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
దీని ప్రకారం ఐపీసీ సెక్షన్ 109 ఫ్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988లోని 13 (2), 13(1)(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఇన్స్పెక్టర్ (ఏసీబీ) వి.వివేకానందస్వామికి అప్పగిస్తూ సీబీఐ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.
గాంధీ అక్రమాస్తులు సీబీఐ గుర్తించినవి ఇవే:
* విజయవాడ ఎనికేపాడు గ్రామంలో భార్య శిరీష పేరు మీద రూ.28.71 లక్షల విలువ చేసే 0.43 సెంట్ల భూమి, తరిగొప్పుల గ్రామంలో కుమార్తె పేరు మీద రూ.15.67 లక్షల విలువ చేసే 2.96 ఎకరాల భూమి
* కృష్ణాజిల్లా కంకిపాడులో గాంధీ తండ్రి బి.నర్సింహారావు పేరు మీద 360 చదరపు గజాల స్థలం, ప్రొద్దుటూరులో తండ్రి పేరు మీద 266.66 చ.గ. స్థలం.
* కొండాపూర్, రాజరాజేశ్వరి నగర్లో తండ్రి పేరు మీద రూ.17.15 లక్షల విలువ చేసే 93,300 చ.గజాల స్థలం.
* కూకట్పల్లి, హైదర్నగర్లో గాంధీ పేరు మీద రూ.29.56 లక్షల విలువ చేసే 257.83 గ. స్థలం, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో 10 గుంటల స్థలం. ఇందులో గాంధీ భార్య శిరీషా వాటా రూ.12.31 లక్షలు.
* గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రూ.2.72 లక్షల విలువ చేసే 0.42 సెంట్ల భూమి.
* హైదరాబాద్ కూకట్పల్లి యాక్సిస్ బ్యాంకులో భార్య శిరీష పేరు మీద రూ.20 లక్షల బ్యాలెన్స్, తండ్రి పేరు మీద ఉన్న జాయింట్ ఖాతాలో రూ.10.12 లక్షల బ్యాలెన్స్, శిరీష పేరు మీద రూ.6.50 లక్షల విలువ చేసే ఫోక్స్వ్యాగన్ పోలో కారు ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
* విజయవాడ, గుణదల వార్డు నెంబర్ 31లో రూ.72.87 లక్షల విలువ చేసే 327 చ.గజాల భూమి. ఇది గాంధీ తండ్రి, భార్య, మరొకరి పేరు మీద ఉంది.
* విజయవాడ శివారు పెదపులిపాక గ్రామంలో రూ.9.14 లక్షల విలువ చేసే 242 చ.గజాల స్థలం, కానూరులో తండ్రి, చిన్న కుమార్తె పేరు మీద రూ.45.15 లక్షల విలువ చేసే 400 గ.స్థలం.