సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కనే ఉంచుకొని టీఆర్ఎస్తో పొత్తుల గురించి ఆపార్టీ నేత కేటీఆర్తో చర్చించారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా విమర్శించారు. గురువారం ఏపీ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరుకావడంపై అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్కు జగన్ కౌంటరిచ్చారు. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టు స్ధిరీకరించడం కోసం ఉపయోగిస్తే సంతోషించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గోదావరి జలాలను శ్రీశైలం ద్వారా కృష్ణా ఆయకట్టుకు తరలించడంపై రెండురాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు. ఒప్పందాలు జరగకుండానే రాష్ట్రానికి ఎలా అన్యాయం జరుగుతోందని చంద్రబాబునాయుడు చెబుతారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో ఈ నీటి విషయమై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరుగుతాయన్నారు.
ఈ ఒప్పందాలపై రెండు రాష్ట్రాల సీఎంల హోదాలో కేసీఆర్, తాను, రెండురాష్ట్రాల అధికారులు సంతకాలు చేస్తామని ఆయన చెప్పారు. తాను కేసీఆర్తో కలవకుండా కేంద్రంకుట్రలు చేసిందని చంద్రబాబు చేసిన ప్రకటనను జగన్ అసెంబ్లీలో చూపించారు. గతంలో తన బావమరిది హరికృష్ణ చనిపోతే కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన కేటీఆర్తో చంద్రబాబు పొత్తుల గురించి చర్చించారని జగన్ విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు అప్పుడు ఎందుకు అడ్డుకోలేదో చెప్పాలన్నారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా వ్యవహరించాలని సీఎం కోరారు. అయితే అప్పుడే కాళేశ్వరం పూర్తయ్యిందని, తాను వెళ్లి స్విచ్ వేసినా వేయకపోయినా నీళ్లు రావడం ఖాయమని జగన్ చమత్కరించారు.