తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న గురువారం ప్రగతిభవన్లో పురపాలక ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో పురపాలక ఎన్నికలను కొత్త చట్టంతోనే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై కొత్త పురపాలక బిల్లును ఆమోదించనుంది. గతంలో ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల ప్రకటన ఇచ్చి ఈ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తర్వాతే పుర పోరు జరిపేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
బిల్లు ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. ఆ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులతో తుది బిల్లును రూపొందించనుంది. శాసనసభ, శాసనమండలిలో దీన్ని ఆమోదించాక కొత్త చట్టాన్ని అమలులోకి తేనుంది. ఏడో తేదీకి వార్డుల పునర్విభజన పూర్తి చేయగా ఈనెల 14వ తేదీ నాటికి ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి కానుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అప్పటికి ఓటర్ల జాబితాల ప్రచురణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 14 లేదా 15న రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలకశాఖ అందజేస్తుందని.. 15 లేదా 16న ఎన్నికల ప్రకటన వెలువడుతుందని భావించారు. తాజాగా కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆగస్టు రెండో వారంలోపు ఎన్నికలు నిర్వహించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.