తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్వయంగా ఆరాతీస్తున్నారు. ఎల్లంపల్లినుంచి మేడిగడ్డవరకు 104 కిలోమీటర్ల గోదావరి తీరం మంథని నియోజకవర్గంలోనే ఉన్నది. గోదావరి జలాలు కన్నెపల్లి పంపుహౌస్ద్వారా అన్నారం బరాజ్కు చేరుకుని ఎదురెక్కుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు ఫోన్చేసి వివరాలు తెలుసుకున్నారు.
గోదావరి ఎదురెక్కుతూ గ్రామాలను తాకుతుంటే ఆయా గ్రామాల్లోని ప్రజల, రైతుల స్పందన ఎలా ఉన్నదో అడిగి తెలుసుకున్నారు. గోదావరితోపాటు పెద్దవాగు, పొక్కూరువాగు, మానేరు, బొక్కలవాగుల్లో పెరుగుతున్న జలాల గురించి తెలుసుకొని, వాటిద్వారా కలిగే ప్రయోజనాలపై మధుతో చర్చించారు. క్రమంగా గోదావరి ఎదురెక్కి పారే సన్నివేశాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
తాను కూడా ప్రతినిత్యం గోదావరిలో పెరుగుతున్న జలాలపై తెలుసుకుంటున్నట్టు వెల్లడించారు. ఎగబాకుతున్న గోదావరి మాతకు పసుపు, కుంకుమ, సారెతో ప్రత్యేక పూజలు చేయడంపై పుట్ట మధూకర్ను సీఎం అభినందించారు. ఎడారిగా ఉన్న గోదావరి నదిలోకి జలాలు ఎదురెక్కుతున్న అపూర్వ, అద్భుత దృశ్యాలకు సంబంధించిన వీడియో, ఫొటోలను పంపాలని కోరగా.. ఆ మేరకు మధూకర్ వాటిని సీఎంకు పంపారు.