జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేసింది. తేని, మధురై, పెరంబలూరు, తిరునెల్వేలి, రామనాథపురంలలో ఎన్ఐఏ మెరుపు దాడులు చేసింది. బృందాలుగా విడిపోయి విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశారు అధికారులు.
ఈ 14 మంది తమిళ ముస్లింలు గతంలో దుబాయ్ లో ఉండేవారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వీరిని సొంత రాష్ట్రం తమిళనాడుకు పంపించింది దుబాయ్ ప్రభుత్వం. అన్జారుల్లా అనే తీవ్రవాద సంస్థతో సంప్రదింపులు జరుపుతూ సంస్థకు నిధులు సమీకరించడంలో వీళ్లు యాక్టివ్ గా పనిచేశారనే సమాచారంతో దుబాయ్ ప్రభుత్వం వీరిని వెనక్కి పంపించివేసింది. దుబాయ్ అధికారుల సమాచారం అందుకున్న ఎన్ఐఏ తమిళనాడులో తనిఖీలు చేసి 14మందిని ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేసింది. వీరికి జులై 25 వరకు కోర్టు రిమాండ్ విధించింది. వారి నుండి ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్ లు, సెల్ పోన్లు సీజ్ చేశారు అధికారులు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.