ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తొలి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆగస్టులో తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ యూఎస్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి అమెరికాలో పర్యటించనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పలు కీలక అధికారిక, రాజకీయ సంబంధమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు వైఎస్ జగన్ ఫ్యామిలీ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా అమెరికాలోని డెట్రాయిట్లో ఎన్ఆర్ఐలు నిర్వహించే ఆత్మీయసభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఎన్నారైలతో కలిసి జగన్ కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నారైలు చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్లో పెట్టుబడుల గురించి సైతం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఎన్నారైల సంక్షేమం కోసం ఏపీ సర్కారు తీసుకోవాల్సిన నిర్ణయాలు సైతం ప్రస్తావిస్తారని తెలుస్తోంది.