ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన పలువురు నేతలు ఆ పార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు అదే దారిలో మరో కీలక నేత తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి.టీడీపీ గద్దె దిగిపోగానే, అందులో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంపయ్యారు.మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత అనుంగులు, ఆర్థిక అండదండలిచ్చినవారే ఆ పార్టీని వదిలేశారు. తాజాగా, టీడీపీలో సీనియర్ దళిత నేత కూడా బీజేపీలోకి ఎగిరిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు..
ఇంతకీ ఆయనెవరో చెప్పలేదు కదూ… ఆయనే జూపూడి ప్రభాకర్ రావు. మంచి వాగ్ధాటి గల ఈయనను నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత, ఏపీ కాంగ్రెస్ కనుమరుగవడంతో, 2014లో వైసీపీలో చేరారు. కొండపి నుంచి ఎన్నికల్లో పోటీకి దిగి ఓడిపోయారు.
టీడీపీ అధికారంలోకి రావడంతో జూపూడీ ఫ్లేట్ ఫిరాయించారు. వెంటనే చంద్రబాబును ప్రసన్నం చేసుకుని టీడీపీలో చేరారు. కానీ, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో జూపూడి ఆలోచనలో పడ్డారు. పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీలోకి వెళ్లలేరు. టీడీపీలో కొనసాగలేరు. ఇక ఉన్నదల్లా ఒక్క బీజేపీ మాత్రమే. అందుకే, బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు ఆయన సన్నిహితులు ద్వారా తెలుస్తోంది.