టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజక్టు ద్వారా నగరానికి కావాల్సినంత నీరు అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కేటీఆర్ బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ట్విటర్లో పలు అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరతాయని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్కు రిప్లైగా మారుతి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్కు కేవలం 48 రోజులకు సరిపడే తాగునీరు మాత్రమే అందుబాటులో ఉందా అని కేటీఆర్ను ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘ఆ రిపోర్ట్ కచ్చితమైనది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాణహిత నుంచి నీరు ఎత్తిపోయడం ప్రారంభమైంది. కొద్ది వారాల్లోనే నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనుంది. దీంతో హైదరాబాద్కు 175 ఎంజీడీల నీరు అందనుంది. అందువల్ల తాగునీటి సమస్య అనేది చోటుచేసుకోదు. అలాగే నీటి పొదుపుకు సంబంధించిన ప్రాధాన్యతను కూడా నగరవాసులు గుర్తించార’ని సమాధానమిచ్చారు. అనంతరం మారుతి శుభావార్త చెప్పారంటూ కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.