ఇటీవల కూల్చేసిన ప్రజావేదిక నిర్మాణంపై ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ ప్రజావేదిక నిర్మించారని విమర్శించారు. అక్రమాలు కట్టడాలు తొలగిస్తే అసెంబ్లీలో చర్చించడం బాధాకరమని, చంద్రబాబు నివాసం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉందని చెప్పుకొచ్చారు. అక్రమ కట్టడాల వల్లే వరదలు వస్తున్నాయని, తాను సీఎం కాబట్టి తనకు చట్టాలు వర్తించవు.. తనను ఏం ఎవరు ఏం చేస్తారంటూ చంద్రబాబు వ్యవహరించారని జగన్ ఆరోపించారు. విజయవాడలో ఫ్లడ్ లెవెల్ 22.60 ఉంటే, చంద్రబాబు నివాసం 19.50 ఎత్తులో ఉందని దానివల్ల ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇలా నిర్మించడం వల్ల వరదలు వస్తాయని, ఇలాగే కట్టడాలు పెరిగిపోతే విజయవాడ కచ్చితంగా మునిగిపోయే ప్రమాదం ఉందని అందువల్లే వాటిని తొలగించాలని తాను నిర్ణయించుకున్నట్లు జగన్ తెలిపారు. రూల్స్ ఎవరికైనా ఒక్కటేనని.. సామాన్యుడికి, సీఎంకి ఒకటే రూల్ అని స్పష్టం చేశారు. నిబంధనలను పట్టించుకోకుండా నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు వ్యవహరించడం సిగ్గుచేటని చెప్పుకొచ్చారు. రివర్ కంజర్వేట్ అథారిటీ, విజయవాడ ఇంజనీరింగ్ అధికారులు సైతం చంద్రబాబు నివాసం, ప్రజావేదిక నిర్మాణం సరికాదంటూ స్పష్టం చేసిందని తెలిపారు. అయినా నిబంధనలకు తిలోదకాలిస్తూ చంద్రబాబు ప్రజావేదిక, ఇల్లు నిర్మించారంటూ జగన్ నిప్పులు చెరిగారు.