తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతోంది. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు హరీశ్రావు మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్లు పెంపు జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల పింఛన్ల పెంపు 6 నెలల ఆలస్యం అయింది. రూ.2016, రూ.3016 పింఛను ఇస్తూ సీఎం కేసీఆర్ పేదలకు ఆసరాగా నిలుస్తున్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. త్వరలోనే నిజమైన పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ చేస్తాం. చెట్లు తగ్గడం వల్లే కాలుష్యం పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు.