ఉన్నతమైన హోదాలో ఉన్నవారు తమ గౌరవాన్ని కాపాడుకునేలా మాట్లాడాలి. కానీ అది విస్మరించి నోటికి పని చెప్పి…వివాదాలను కొనితెచ్చుకుంటే…అలాంటి వారిని ఏమనాల్సి ఉంటుంది?ఇప్పుడు ఈ చర్చ ఎందుకు తెరమీదకు వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలతో. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే పోలీసులను చంపడం కంటే.. అవినీతి చేసే రాజకీయ నేతల్ని చంపాలని ఏకంగా ఉగ్రవాదులకు సూచించారు.
“టెర్రరిస్టులు పోలీసులను చంపుతున్నారు. భద్రతా బలగాలను చంపుతున్నారు. ఎస్పీఓలను చంపుతున్నారు.. ఇలాంటి వారిని చంపడం కంటే ప్రజల ఆస్తుల్ని దోచుకునే రాజకీయ నేతల్ని, అవినీతికి పాల్పడే అధికారులపై తమ ప్రతాపాన్ని చూపాలి` అని గవర్నర్ పిలుపునిచ్చారు. కాగా, గవర్నర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది. ఆయన ఉగ్రవాదులకు ఈవిధంగా సూచించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.