తూర్పుగోదావరి జిల్లా మండపేట లో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు జషిత్ కథ సుఖాంతమైంది. పోలీసుల వెతుకులాట, సోషల్ మీడియా సపోర్ట్ తో భయపడిపోయిన దుండగులు అర్ధరాత్రి ఒంటిగంటకు రాయవరం మండలం కుతుకులూరు శివారులోని ఇటుకబట్టి వద్ద వదిలివెళ్లారు. బాలుడి ఏడుపు విని అక్కడి కూలీలు జషిత్ను చేరదీశారు. రాత్రంతా తమ వద్దే ఉంచుకుని ఆకలితో ఉన్న చిన్నారికి భోజనం పెట్టారు. అనంతరం పోలీసుల సాయంతో బాలుడిని స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ నయీం అస్మి బాలుడిని తల్లికి అప్పగించారు. అయితే చిన్న పిల్లలు చేసే పనులు కొన్నిసార్లు నవ్వుతెప్పిస్తాయి.
క్షేమంగా ఇంటికి చేరిన జషిత్ ఇంటికి చేరుకోగానే మీడియా అతన్ని చుట్టుముట్టి ప్రశ్నలు అడిగారు.. జషిత్ కూడా ఉత్సాహంగా సమాధానం చెప్పాడు. ఇంతలో ఒక విలేకరి కిడ్నాపర్లు నీకు తెలుసా అని ప్రశ్నించగా దానికి జషిత్ ఆలోచించి ఇద్దరిలో ఒకరిపేరు తెలీదు.. ఒకరి పేరు తెలుసన్నాడు. వెంటనే ఆ కిడ్నాపర్ పేరు చెప్పమని అడిగారు. దీనికి స్పందించిన జషిత్ మీకు చెప్పను.. మా ఫ్రెండ్స్ తో మాత్రమే షేర్ చేసుకుంటానని ముద్దుముద్దుగా సమాధానమిచ్చాడు. దీంతో అక్కడంతా నవ్వులు విరిశాయి. అనంతరం చిన్నారి జషిత్పై మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలడగగా ఉత్సాహంగా సమాధానం చెప్పాడు. తనను కిడ్నాప్ చేసే విధానాన్ని చెప్పేశాడు. చాలా ప్రశ్నలకు నాకేం తెలుసు అంటూ ఎదురు ప్రశ్నించాడు. అలాగే తనకు ఎక్కువగా ఇడ్లీనే పెట్టేవారని తిట్టలేదు.. కొట్టలేదు అంటూ స్పష్టంగా చెప్పాడు.