ప్రభుత్వం మారినా.. తాను అధికారంలోకి వచ్చినా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మతంపేరుతో కుల రాజకీయం జరుగుతూనే ఉంది. గతకొన్ని దశాబ్ధాలుగా జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి క్రైస్తవమతం పట్ల పాటిస్తున్న విశ్వాసం గురించి బహిరంగంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినా దానిని ఆయుధంగా చేసుకుని అనేకమంది రాజకీయ నాయకులు జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతమైన విశ్వాసాలను సమాజంలో చెడ్డగా చూపించడం జరుగుతోంది. అయినా జగన్ ఏ రోజూ ఏ మతం గురించి ఎక్కడా చెప్పలేదు. అన్ని మతాలను సమానంగా గౌరవించారు.. తాను వెళ్ళని గుడి లేదు , దేవాలయం లేదు, మసీద్ లేదు.. తిరుమలకు సైతం కాలినడకన వెళ్లారు.
సీఎం అయ్యాక కూడా అందర్నీ సమానంగా చూస్తూ సంయమనంతో ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. తన మహోత్తరమైన నిర్ణయాల వల్ల రాష్ట్రంలో అనేకమంది సంతోషంతో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నింటిని చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. అందుకోసం జగన్ ఎంత శ్రమ పడుతున్నారో ఉద్యోగస్థులతో ఎలా వ్యవహరిస్తున్నారో, సంక్షేమ పధకాలను పేదలకు అందించడం కోసం ఎంత ఆలోచిస్తున్నారో అందరికీ తెలుసు.. అయితే జగన్ ముఖ్యమంత్రి కానపుడు తనపై ఎలా దృష్ప్రచారం చేసారో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు.. అన్ని కుల, మతాల ప్రజలు ఆశీర్వదించి అఖండ విజయం కట్టబెట్టినా ఇంకా కొందరు పనిగట్టుకుని వివిధ సందర్భాలలో విషం చిమ్ముతూనే ఉన్నారు. సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. మత విద్వేషాలను రెచ్చ గొట్టి హిందూ సమాజంలో జగన్ పై వ్యతిరేకత తీసుకువచ్చి ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.