అప్పటి సమైక్య రాష్ట్రంలో రైతన్న చనిపోయిన.. లేదా ఏదైన ప్రమాదం సంభవించి రైతన్న మంచాన పడిన కానీ ఆ రైతు కుటుంబం చాలా కష్టాలు పడేది. ఒకానోక సమయంలో ఆ రైతు కుటుంబం అప్పుల బాధలో కూరుకుపోయేది. ఇంటికి ఉన్న పెద్ద దిక్కే లేనప్పుడు ఎలాంటి పనిచేయని స్థితిలో ఏమి చేయాలో పాలుపోక ఆ రైతుకుటుంబం చితికిపోయేది. ఎన్నో పోరాటాలు .. ఉద్యమాలు. ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఏ ఒక్క రైతు ఎదుర్కోవద్దు అనే ముఖ్య కారణంతో ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టిన పథకం రైతుబీమా.
రైతుబీమా పథకం ద్వారా ప్రముఖ జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ కి రైతు తరపున ప్రభుత్వమే ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇందుకు సర్కారు దాదాపు తొమ్మిదివందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల వరకు ఎల్ఐసీకి చెల్లించింది. ఈ పథకం ప్రవేశ పెట్టిన తొలి ఏడాదిలోనే సర్కారు మొత్తం రూ.751కోట్ల రూపాయలను రైతన్న కుటుంబాలకు అందజేసింది. గతేడాది ఆరోగ్య కారణాలు,తదితర పలు సమస్యలతో కాలం చెల్లించిన రైతన్న కుటుంబాలకు అండగా ఉంటూ సర్కారు మొత్తం పదిహేను వేల మంది రైతన్న కుటుంబాలకు రైతుబీమా సొమ్మును చెల్లించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మీడియాకిచ్చిన ప్రకటనలో తెలిపింది. పేదరైతులకు పెద్దసాయంగా సర్కారు రైతుబీమాను తీసుకొచ్చింది.