తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో ఉపాధి కోసం సౌదీ అరేబియాలో వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన బూడిద పోచయ్య(50) ఆరునెలల క్రితం మరణించగా.. యువనేత కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఆయన మృతదేహం నిన్న శనివారం స్వగ్రామానికి చేరింది. బూడిద పోచయ్య 25 ఏండ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. రెండేండ్లకోసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ ఏడాది
ఫిబ్రవరి 12న పనిచేసే చోట హఠాన్మరణం చెందాడు.
పోచయ్య మృతి చెందినా మూడు నెలల వరకు కుటుంబసభ్యులకు సమాచారం అందలేదు. ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్.. తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ సెక్రటరీకి లేఖ రాసి, ఎంబీసీకి సమాచారం అందించారు. కాగా అక్కడి కంపెనీ యజమాని మరణించడంతో అతడి కొడుకు పోచయ్య మృతదేహం అప్పగింతపై చేతులెత్తేశారు. దీంతో న్యాయ స్థానంలో యాజమాన్యంపై కేసు వేశారు.సౌదీ ప్రభుత్వం స్పందించి విచారణ చేయించగా, మృతదేహం వద్ద రెండు పాస్పోర్టు ఫొటోలు లభ్యమయ్యాయి. వాటిని కుటుంబ సభ్యులకు సమాచారం అందివ్వగా, పోచయ్యగా గుర్తించారు.
మృతిపై అనుమానాలు లేవని, కొడుకు లవణ్కుమార్, అల్లుడు తిరుపతి, భార్యతో లిఖిత పూర్వకంగా అఫిడవిట్ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. తర్వాత వేగవంతంగా భారత ఎంబీసీ ఎన్వోసీ జారీ చేసింది. వెంటనే మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించాలని ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎంబీసీ హైకమిషనర్ ద్వారా మృతదేహం తరలింపునకు అయ్యే ఖర్చులను చెల్లించింది. దీంతో శనివారం ఉదయం అతని మృతదేహం శంషాబాద్ విమనాశ్రయానికి చేరుకోగా, అక్కడి నుంచి తంగళ్లపల్లికి తీసుకొచ్చారు. మృతదేహం స్వగ్రామానికి త్వరగా చేరేలా చొరవ తీసుకున్నందుకు ఎంపీపీ పడిగెల మానస, సర్పంచ్ అంకారపు అనితతోపాటు ప్రజాప్రతినిధులు తదితరులు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.