కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చిదంబరం ను ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. ఈకేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం చిదంబరంకు ముందస్తు బెయిల్ ను నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో చిదంబరం కోసం సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గతరాత్రి సీబీఐ అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ చిదంబరం కనిపించలేదు. టికి సీబీఐ అధికారులు నోటీసులు అంటించి రెండుగంటల వ్యవధిలో తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారం కూడా మళ్లీ మూడోసారి ఆయన ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంటికి ఎప్పుడు వస్తే అప్పుడు సీబీఐ అధికారులు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో చిదంబరం ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఇప్పటికే ఆయన కోసం కాంగ్రెస్ కు చెందిన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపుతోనే చిదంబరంను అరెస్టు చేయాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే పార్టీనేతలు ప్రియాంక గాంధి, జైరాం రమేశ్, రణ్దీప్ సింగ్ సుర్జీవాలా తదితరులు చిదంబరంకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు మాత్రం జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలుకు పంపడంలో కీలకపాత్ర పోషించినందుకు, చంద్రబాబును చీకట్లో కలిసి అడ్డగోలుగా స్టేలు ఇచ్చినందుకు నీ పాపం పండిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.