వాళ్లిద్దరు ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తులు…టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా వాళ్లిద్దరూ ఉండేవారు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖర్చు అంతా బడా పారిశ్రామికవేత్తలైన వాళ్లిద్దరే భరించేవారని పార్టీలో టాక్. అయితే బాబుగారికి పరమ విధేయులుగా ఉన్న వాళ్లిద్దరు…ఇటీవల కాషాయ పార్టీలో చేరారు. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం..మనీ లాండరింగ్ కేసుల్లోంచి తప్పించుకోవడం కోసమే వాళ్లిద్దరూ బీజేపీలో చేరినట్లు రాజకీయంగా విమర్శలు వచ్చాయి. అయితే చంద్రబాబే…భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వారిద్దరిని బీజేపీలోకి పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాషాయ కండువా కప్పుకున్న వాళ్లిద్దరి వరుస చూస్తుంటే…ఇది నిజమే అనిపిస్తుంది. ఇంతకీ వాళ్లిద్దరు ఎవరో అర్థమైందనుకుంటా…టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సుజనా చౌదరి, సీఎం రమేష్లు. పాపం కాషాయ కండువా కప్పుకున్నా..వీళ్లిద్దరు ఇంకా బాబు బంట్రోతుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఈ మాట ఏకంగా ఏపీ బీజేపీ నేతలే అంటున్నారు.
తాజాగా పోలవరం, రాజధాని నిర్మాణ విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజధాని విషయంలో బొత్స వ్యాఖ్యలను పట్టుకుని రాజకీయ లబ్ది కోసం టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండగా…ఏపీ బీజేపీ నేతలు పెద్దగా రియాక్ట్ అవలేదు. అలాగే వరదల విషయంలో , రాజధాని విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై చేసిన కామెంట్స్పై టీడీపీ నేతలే రియాక్ట్ కాకపోయినా..సుజనా చౌదరి మాత్రం వెంటనే ప్రెస్మీట్ పెట్టేసి జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరదలపై సీడబ్ల్యూసీ హెచ్చరించినా ఏపీ ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదని సుజనా ప్రశ్నించాడు. చంద్రబాబు ఇంటిని ముంచాలనే వరదనీటిని ప్రభుత్వం కిందికి వదిలిందా? రాజధాని ప్రాంతాన్ని ముంచాలని చూస్తున్నారా? అంటూ మండిపడ్డారు. రాజధాని విషయంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారంటూ సుజనా వ్యాఖ్యానించారు. రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వం అధికారికంగా ఏ విషయం ప్రకటించికపోయినా సుజనా మాత్రం బొత్స వ్యాఖ్యలపై పెడార్థం తీశారు. రాజధాని విషయంలో ఇష్టానుసారంగా చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని సుజనా ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. దీంతో బీజేపీ నేతలు తలపట్టుకున్నారు.
ఇక సీఎం రమేష్ కూడా అమెరికాలో జగన్ జ్యోతి వెలిగించలేదంటూ ఓ వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేసి అభాసుపాలయ్యాడు. దీంతో సుజనా, సీఎం రమేష్లు కాషాయ నేతల్లా కాకుండా చంద్రబాబు బంట్రోతుల్లా వ్యవహరిస్తున్నారని…ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. వాళ్లిద్దరు పార్టీ స్టాండ్పై కాకుండా చంద్రబాబును విమర్శించిన వారిపై మాట్లాడుతున్నారని, వారి తీరు ఇలాగే ఉంటే పార్టీకే నష్టమని ఏపీ కమలం నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. రాజధాని తరలింపుపై వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు…విధివిధానాలు కూడా రూపొందించలేదు.. రాజధాని మార్పు విషయంలో పార్టీ స్టాండ్ ఏంటో ఇంకా నిర్ణయించుకోలేనప్పటికీ సుజనా చౌదరి బాహటంగా విమర్శించడం తమ పార్టీని ఆత్మరక్షణలో పడేసిందని బీజేపీ నేతలు కొందరు అంటున్నారు. అంతే కాదు…టీడీపీ నుంచి బీజేపీలో చేరినా…సుజనా, రమేష్లు ఇంకా పచ్చనేతల్లాగే వ్యవహరిస్తున్నారని…క్రియాశీల నేతలు బీజేపీలోకి రాకుండా వీరిద్దరే అడ్డుపడుతున్నారని ఏపీ బీజేపీ నేతలు హైకమాండ్కు ఇప్పటికే ఫిర్యాదులు చేశారట.మొత్తంగా కాషాయ కండువా కప్పుకున్నా, బాబు బంట్రోతుల్లా వ్యవహరిస్తున్న సుజనా, సీఎం రమేష్ల వ్యవహార శైలిలో ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మనీ ల్యాండరింగ్, రుణాల ఎగవేత వంటి అవినీతి కేసుల్లో ఇరుక్కున్న సుజనా, సీఎం రమేష్ల్లాంటి నేతలను పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఇప్పుడు వాళ్లను వదిలించుకోలేక..వారి బాబు భక్తిని తట్టుకోలేక..అల్లాడిపోతుంది.