దేశంలో ప్రధాన నదులైన గోదావరి- కావేరి అనుసంధాన ప్రాజెక్టును కేంద్రం మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) సమావేశంలో ప్రతిపాదనలు తీసుకొచ్చింది. మొత్తం మూడు ప్రతిపాదనలను తెలంగాణ ముందుంచింది. గతంలో ఎన్డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనలతోపాటు తెలంగాణ సూచించిన మార్పులకు అనుగుణంగా తయారుచేసిన తాజా ప్రతిపాదనలనూ ప్రస్తావించింది.
జానంపేట నుంచి దుమ్ముగూడెం.. మణుగూరు బొగ్గు గనులను అనుసరిస్తూ.. హుజూర్నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ మీదుగా కావేరికి గోదావరిజలాల్ని తరలించే అలైన్మెంట్ను ఎన్డబ్ల్యూడీఏ గతంలోనే రూపొందించింది. పూర్తిగా పైపులైన్ల ద్వారా చేపట్టే ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా ఉన్నందు న ఆ ప్రతిపాదనను పక్కకు పెట్టింది.
తాజాగా ఇచ్చంపల్లి నుంచి గోదావరిజలాల్ని తరలించే అలైన్మెంట్ను సమావేశంలో ప్రస్తావించింది.
ఇచ్చంపల్లి నుంచి జలాలను మూసీ.. ఆపై సాగర్కు తరలించేలా అలైన్మెంట్ రూ పొందించినట్టు, ఇందుకు అంచనా వ్యయం రూ.73వేల కోట్లుగా పేర్కొన్నది. దీనిపై తెలంగాణ అభిప్రాయాల్ని చెప్పాల్సిందిగా కోరారు. సమావేశంలో భాగంగా ఇటీవలికాలంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృష్ణా బేసిన్కు గోదావరిజలాల్ని మళ్లించేందుకు అధ్యయనం చేస్తున్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. రెండు రాష్ర్టాలు ఈ ప్రాజెక్టును చేపట్టడం వల్ల తాము ప్రతిపాదిస్తున్న గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుంది కదా? అని కూడా అధికారులు సందేహం వ్యక్తం చేశారు.