గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి ఒకెత్తు అయితే…నిర్వాసితుల పేరుతో టీడీపీ నేతలు వేలకోట్లు స్వాహా చేసిన విషయం బట్టబయలైంది. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు చిక్కుల్లో పడినట్లే అని ఏపీ రాజకీయవర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలవరం డ్యామ్ విషయంలో డ్యామ్ నిర్మాణం కంటే నిర్వాసితులకు పరిహారం చెల్లించడమే అతి పెద్ద టాస్క్. వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, హైడల్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు కంటే అధిక మొత్తం నిర్వాసితులకు చెల్లించాలి. ప్రధానంగా పోలవరం డ్యామ్ నిర్మాణం వలన పరిసర మండలాల్లోని అనేక గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ గ్రామాల్లో మెజారిటీ శాతం గిరిజనులు ఉండగా, వెనుకబడిన వర్గాల వారు కూడా ఉన్నారు. పోలవరం నిర్మాణంతో నిర్వాసితులవుతున్న వీరందరికి తగిన పరిహారాన్ని పరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. అయితే ఇక్కడే టీడీపీ నేతలు చేతివాటం చూపించారు. అమాయకులైన గిరిజనులను మోసం చేసి, నిర్వాసితుల పేరుతో బినామీ పత్రాలు సృష్టించి వేల కోట్లు స్వాహా చేశారు. ఈ స్కామ్లో టీడీపీ కింది స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి టీడీపీ పెద్దల వరకు వాటాలు అందాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా పోలవరం నిర్వాసితుల సంక్షేమ సమితి పేరుతో నిర్వాసితులు తమకు పరిహారం విషయంలో అన్యాయం జరిగిందంటూ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి ఆరెస్సెస్ కూడా మద్దతు పలికింది. ఆరెస్సెస్ ఆధ్వర్యంలో నిర్వాసితులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. దీంతో కేంద్ర పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన భారతీయ జనతాపార్టీ నిర్వాసితుల పోరాటానికి సారథ్యం వహిస్తోంది. ఇటీవల పోలవరం నిర్వాసితులు, ఆరెస్సెస్, బీజేపీ నేతలంతా కలిసి పోలవరం ఇంజనీర్ల, ప్రాజెక్ట్ అథారిటీని కలిసి తమకు అందాల్సిన పరిహారాన్ని టీడీపీ నేతలు బినామీ పేర్లతో కొట్టేసిన వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వాసితుల పరిహారాన్ని టీడీపీ నేతలు స్వాహా చేసిన విషయంపై సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలవరం అథారిటీ అధికారులకు డీటైల్డ్గా విచారణ జరపాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో, నిర్వాసితుల పరిహారం గోల్మాల్ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే టీడీపీ ముఖ్యనేతలతో పాటు, చంద్రబాబు కూడా చిక్కుల్లో పడడం ఖాయమనే చర్చ జరుగుతోంది.