ఈరోజు వినాయకచవితి…సకల దేవతాగణముల అధిపతి… శ్రీ గణనాధుడు… తొలిపూజలు అందుకునే ఆదిదేవుడు…. సర్వ విద్యలకూ అధినాథుడు. ఏ విఘ్నాలు కలుగకుండా ఈ చరాచర జగత్తును కాపాడే జగత్ రక్షకుడు. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటున్నాం. ఈ రోజునే వినాయకుడిని సర్వదేవతాగణాధిపతిగా ప్రకటించిన రోజు. వినాయకుడు జ్ఞానానికి, సంపత్తుకి, అదృష్టానికి ప్రతీక. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు మొదలువుతుంది. దక్షిణాయనం, శ్రావణమాసం, బహుళపక్షంలో వచ్చే తొలిపండుగ వినాయకచవితి. హిందూ పండుగలు వినాయక చవితితో మొదలై ఉగాదితో ముగుస్తాయి.
భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు. అంటే సకలదేవతలకు వినాయకుడే అధిపతి. బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు రుగ్వేదం చెబుతోంది. ఇక పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన లేఖకుడిగా గణపతిని నియమించాడు.
వినాయకచవితి నాడు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు గురవుతారని ప్రతీతి. దీని వెనక పెద్ద కథ ఉంది. ఒకసారి వినాయకుడు పంచభక్ష పరమాన్నాలు భుజించి, భుక్తాయసంతో నడవలేకపోతున్నాడంట. దీంతో చంద్రుడు వినాయకుడిని చూసి పకపకా నవ్వాడంట. దీంతో వినాయకుడి పొట్టపగిలిపోయిందంట..దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి నిన్ను చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయని శపించిందంట. దీంతో చంద్రుడితోపాటు సకల దేవతలు శరణు కోరితే ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే నిన్ను చూడకూడదు..అది కూడా వినాయక చవితి రోజు పూజ చేసిన కథ తర్వాత అక్షింతలు వేసుకుంటే నిన్ను చూసిన పాపం అంటదు అని చెప్పిదంట.అప్పటి నుంచి వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు తప్పవు అన్న నానుడి కొనసాగుతుంది.
ఇక వినాయక చవితినాడు పంచ వ్యాప్తంగా ప్రాంతాలను బట్టి భిన్న రూపాలతో విఘ్నాధిపతిని ఆరాధిస్తారు. ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా సినిమా హీరోలు, క్రికెటర్ల రూపంలో వినాయకుడిని నిలుపుతున్నారు. ఇది చాలా అపచారం. ప్రధానంగా గణపతిని మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి,నవనీత గణపతి అని ఆరు రూపాల్లో మాత్రమే పూజించాలి.. అలాగే వినాయక చవితి నాడు గణేషుడిని భారీ విగ్రహాలుగా వివిధ రసాయనిక రంగులతో ఆకర్షణీయమైన రూపాలతో కొలుస్తున్నారు. కానీ వేలాదిగా విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం ఏర్పడుతుంది. కావున వినాయకచవితి నాడు మట్టిగణపతినే పూజించడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. మట్టి గణపతిని పూజించండి…పర్యావరణాన్ని పరిరిక్షించండి.. మట్టి గణపతే..మహాగణపతి. తెలుగు ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడు సకల విఘ్నాలు తొలగించి, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు..!