అధికారం ఉందని విర్రవీగితే ఏం జరుగుతుందో పరిస్థితులు ఎలా మారతాయో టీడీపీ నేతలకు అందులోనూ చింతమనేని వంటివారికి బాగా అర్ధమవుతోంది. అత్యంత వివాదాస్పద పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొద్దిరోజులుగా కనిపించడం లేదట.. గత శుక్రవారం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. కారణం చింతమనేని ప్రభాకర్పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అలాగే చింతమనేని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
ఇటీవల జిల్లాలోని పినకడిమికి చెందిన యువకులపై చింతమనేని దౌర్జన్యం చేసారని, ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని ఆయనపై కొందరు యువకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేశారు. చింతమనేనితో పాటు ఆయన అనుచరులపైనా పలు సెక్షన్లకింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొందరు మాత్రం చింతమనేని దొరకకుండా ఉండేందుకు గుండుకొట్టించుకుని మారు వేషంలో తిరుగుతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. పినకమిడి యువకులు పెట్టిన కేసులతో పాటుగా గతంలోనూ ఆయనపై ఎన్నో కేసులు ఉన్న విషయం తెలిసిందే. అధికారం లేకపోవడంతో అరెస్ట్ భయంతోనే చింతమనేని పారిపోయారని లేకుంటే వ్యవస్థలను మ్యానేజ్ చేసేవారని స్థానికులు చెప్తున్నారు.