Home / SLIDER / 2019-20తెలంగాణ బడ్జెట- సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం

2019-20తెలంగాణ బడ్జెట- సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం

2014 జూన్ లో నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడేనాటికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఏవీ లేనప్పటికీ స్థూల అంచనాలతో రాష్ట్ర ప్రయాణం ప్రారంభం అయింది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆశ్చర్య పరిచాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సగర్వంగా నిలిచింది.

ఐదేళ్లలో ఆర్థిక ప్రగతి:
————————–
రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాది నెలకు 6,247 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలిగే పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొని ఉండేవి. ఐదేళ్ళ తరువాత నెలకు 11,305 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది.

రెట్టింపయిన జి.ఎస్.డి.పి.:
——————————
రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండు సంవత్సరాలలో, స్థిర ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జి.ఎస్.డి.పి.) సగటు వృద్ధిరేటు కేవలం 4.2 శాతం ఉండేది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర జి.ఎస్.డి.పి. వృద్ధిరేటు రెండున్నర రెట్లకు పైగా పెరిగి 10.5 శాతంగా నమోదైంది.

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చివరి ఆర్థిక సంవత్సరమైన 2013-14 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి తెలంగాణలో స్థూల రాష్ట్రీయ దేశీయోత్పత్తి (జి.ఎస్.డి.పి.) విలువ ప్రస్తుత ధరల వద్ద 4,51,580 కోట్ల రూపాయలుండేది. ఐదేళ్ళలో రాష్ట్ర సంపద దాదాపు రెట్టింపయింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర సంపద విలువ 8,65,688 కోట్ల రూపాయలుగా నమోదు కావడం, స్వరాష్ట్రంగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంత ధృఢంగా మారిందో తేల్చిచెబుతున్నది.

గణనీయంగా పెరిగిన మూలధన వ్యయం:
———————————————-
రాష్ట్రాభివృద్ధి కోసం, ఆస్తుల కల్పన కోసం వెచ్చించే మూలధన వ్యయం (capital expenditure) లో ఎక్కడో అట్టడుగున ఉండే తెలంగాణ, నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మూలధన వ్యయం మొత్తం వ్యయంలో కేవలం 11.2 శాతం మాత్రమే ఉండేది. నిధుల వినియోగంలో ఎదురైన వివక్ష కారణంగా సమైక్యరాష్ట్రంలో పెట్టిన పెట్టుబడి వ్యయంలో తెలంగాణకు దక్కిన వాటా మరింత తక్కువ ఉండేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల మూలధన వ్యయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 16.9 శాతం మూలధన వ్యయంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయం కేవలం 12.89 శాతమైతే, దేశంలోని అన్ని జనరల్ కేటగిరి రాష్ట్రాల సగటు మూలధన వ్యయం 14.2 శాతం మాత్రమే అని గమనించాలని కోరుతున్నాను.

సమైక్య పాలన చివరి పది సంవత్సరాలలో మూలధన వ్యయం కింద తెలంగాణ ప్రాంతంలో 54,052 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం ఐదేళ్లలోనే 1,03,551 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వెచ్చించింది.

కేవలం బడ్జెట్ నిధులే కాకుండా, వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమీకరించిన నిధుల్లో 65,616 కోట్ల రూపాయలను మూలధన వ్యయంగా వినియోగించడం జరిగింది. అంటే గడిచిన ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొత్తం మూలధన వ్యయం 1,65,167 కోట్ల రూపాయలు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం సగటున ఏడాదికి ఐదు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి సగటున 33,833 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు ఖర్చు పెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో ఆరు రెట్లు పెరిగిన పెట్టుబడి వ్యయమే నిరూపిస్తున్నది.

అన్ని రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి ఫలితంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం 21.49 శాతం సగటు ఆదాయ వృద్ధిరేటు సాధించి, దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది.

ఈ ఆర్థిక గణాంకాలన్నీ భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్థారించి, అధికారికంగా ప్రకటించిన వివరాలు. ఈ లెక్కలనే గత ఐదేళ్లగా శాసనసభకు సమర్పించడం జరిగింది. గౌరవ శాసన సభ సభ్యులందరికీ ఈ విషయం తెలుసు.

స్థిమిత పడిన తెలంగాణ సమాజం:
—————————————-
ప్రభుత్వం అవలంభిస్తున్నసమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ వల్ల…విద్యుత్ రంగంలో చేపట్టిన చర్యల కారణంగా, అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడం వల్ల..
టిఎస్ ఐపాస్ లాంటి ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానం ఫలితంగా, పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేసే అవకాశం కలగడం వల్ల.. కునారిల్లిపోయిన వ్యవసాయ రంగంలో 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో వ్యవసాయ రంగం పునరుత్తేజం పొంది, పంట దిగుబడులు పెరగడం వల్ల.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించడం వల్ల..అన్ని ప్రధాన రంగాల్లో మూలధన వ్యయం (capital expenditure) పెరగడం లాంటి కారణాల వల్ల తెలంగాణలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమయింది.

వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో పురోగతి:
—————————————————–
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధిరేటు నమోదు అయింది. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం వృద్ధిరేటు మాత్రమే తెలంగాణలో నమోదైంది. గడిచిన ఐదేళ్లలో 6.3 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటును నమోదు చేయగలిగింది.

2013-14 ఆర్థిక సంవత్సరంలో
————————————
0.4 శాతం వృద్ధిరేటుతో ఉన్న పారిశ్రామిక రంగంలో కూడా అదనంగా 5.4 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8 శాతం వృద్ధిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో కేవలం 8.7 శాతం వృద్ధి రేటు నమోదైతే, 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 2.8 అదనపు వృద్ధి సాధించి, మొత్తంగా 11.5 శాతం వృద్ధి రేటును సాధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రాష్ట్రంలో ఐటి ఎగుమతుల విలువ 52 వేల కోట్ల రూపాయలుంటే, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికి పైగా పెరిగి, లక్షా 10 వేల కోట్ల రూపాయలకు చేరుకోవడం మన రాష్ట్రం సాధించిన అద్భుత విజయానికి సంకేతం. అవినీతి రహిత పాలన అందించడం వల్ల, సత్వర నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రమే పైన చెప్పిన ఆర్థిక ప్రగతి సాధ్యమైంది.

తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించిన ఫలితంగానే సమైక్య రాష్ట్రంలో అతి దారుణంగా దెబ్బతిన్న గ్రామ సీమలు, వ్యవసాయం, కుల వృత్తులు, చేనేత రంగాలకు పునరుత్తేజం తీసుకురావడం కోసం ప్రభుత్వం తగిన ఆర్థిక ప్రేరణ అందించగలుగుతున్నది. నిరుపేద కుటుంబాల సంక్షేమం కొరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయగలుగుతున్నది. అత్యున్నత నాణ్యమైన విద్యాప్రమాణాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన వందలాది గురుకుల పాఠశాలల్లో లక్షలాది మంది పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్య అభ్యసించగలుగుతున్నారు. రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించుకోగలిగాము. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నాము.

ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా గడిచిన ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చిత్తశుద్ధితో అమలు చేస్తున్న పథకాల వల్ల సమైక్య పాలనలోని జీవన విధ్వంసం లోంచి తెలంగాణ సమాజం తేరుకుని, కుదుటబడి, స్థిమితపడింది.

ఏడాదిన్నరగా ఆర్థిక మాంద్యం:
———————————-
అయితే, దురదృష్టవశాత్తు గడిచిన ఏడాదిన్నర కాలం నుండి దేశం తీవ్ర ఆర్ధిక మాంద్యానికి గురవుతూ వస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (first quarter) లో దేశ జి.డి.పి. వృద్ధి 8 శాతంగా నమోదైంది. అప్పటి నుంచి క్రమంగా తగ్గుకుంటూనే వస్తున్నది. రెండో త్రైమాసికంలో
7 శాతానికి, మూడో త్రైమాసికానికి 6.6 శాతానికి, చివరి త్రైమాసికానికి 5.8 శాతానికి జిడిపి వృద్ధిరేటు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మరింత దిగజారి, 5 శాతం కనిష్ట వృద్ధిని నమోదు చేయగలగడం స్థిరంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు సంకేతంగా నిలుస్తున్నది. ఇప్పుడు నేను చెప్పిన ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వం సాధికారికంగా వెలువరించిన వివరాలే. ఆ లెక్కలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్న ఆర్థిక మాంద్యాన్ని దృవీకరిస్తున్నాయి.

తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలో అనేక వైపరీత్యాలకు దారితీస్తున్న పరిణామాలను మనం అనునిత్యం గమనిస్తూనే వున్నాం.

అన్ని రంగాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం:
———————————————-
ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దేశ ఆర్థిక స్థితిగతులకు సూచికలుగా నిలిచే అతి ముఖ్యమైన విభాగాల్లో ప్రగతి తిరోగమనంలో, పరిస్థితి పూర్తి నిరాశాపూరితంగా ఉందని ఆయా సంస్థలు వెల్లడిస్తున్న అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మోబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం, దేశ వ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది. వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయి. ఇప్పటికే తయారైన వాహనాలు కొనేవారు దిక్కులేక పోవడంతో దేశంలోని ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేయాల్సిన దుస్థితి నెలకొంది. దీని వల్ల మూడు రకాల నష్టం ఏర్పడింది. వాహనాల అమ్మకం ద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి, వ్యాట్ తగ్గిపోయింది. లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఆటోమోబైల్ రంగంలో ఇటీవల కాలంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం ఈ విషమ పరిస్థితికి అద్దం పడుతున్నది.

గత సంవత్సరం విమాన ప్రయాణీకుల వృద్ధి 11.6 శాతం ఉంటే, ఈసంవత్సరం, మైనస్ 0.3 శాతంగానమోదైంది. మొత్తంగా విమాన ప్రయాణీకుల సంఖ్య వృద్ధి 11.9 శాతం తగ్గింది. కార్గో విమానాల ద్వారా జరిగే సరుకు రవాణాలో వృద్ధిరేటు ఏకంగా 10.6 శాతం తగ్గింది. 6 శాతం నుంచి మైనస్ 4.6 శాతానికి పడిపోయింది.

అన్ని రకాల వస్తువుల డిమాండ్ పడిపోవడంతో సరుకు రవాణా చేసే రైల్వే గూడ్సు వ్యాగన్ల బుకింగులలో వృద్ధిరేటు 4.1 శాతం నుంచి 1.6 శాతానికి తగ్గింది. చాలా పరిశ్రమలు మూతపడడంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చింది. దీంతో బొగ్గు ఉత్పత్తిలో వృద్ధిశాతం 10.6 శాతం నుంచి మైనస్ 5.1 శాతానికి పడిపోయింది. రూపాయి మారకం విలువ శరవేగంగా పతనమవుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా డాలర్ తో పోల్చిచూసినప్పుడు మన రూపాయి విలువ అత్యంత కనిష్టంగా 72 రూపాయల 43 పైసలకు పడిపోయింది. నేను పైన పేర్కొన్న విషయాలన్నీ ప్రతిరోజూ ప్రపంచం కోడై కూస్తున్న సంగతులే.

తెలంగాణకు జిఎస్టీ పరిహారం పొందాల్సిన దుస్థితి:
——————————————————-
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా గణనీయంగా పడింది. జిఎస్టీ అమలు చేసిన మొదటి సంవత్సరంలో లెక్కలు తేలకపోవడంతో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే తెలంగాణ రాష్ట్రానికి పరిహారం అందించారు. ఆ తర్వాత మళ్లీ తెలంగాణకు జిఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరమే రాలేదు.కానీ ఇటీవల ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 175 కోట్ల రూపాయలు, జూన్, జూలై నెలల్లో 700 కోట్ల రూపాయలు జిఎస్టీ పరిహారంగా తీసుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో తీసుకున్న పరిహారం కన్నా జూన్, జూలైలో లో తీసుకున్న పరిహారం నాలుగింతలు పెరగడం దిగజారిన ఆర్థిక పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో అర్థం చేసుకోవాల్సిందిగా నేను గౌరవ సభ్యులను కోరుతున్నాను.

దేశంలో స్థూల ఆర్థిక విధానాలను శాసించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం తీసుకొచ్చిన విధానాన్నే రాష్ట్రాలు అనుసరించాలి తప్ప, మరో గత్యంతరం లేదు. దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా అతీతం కాదు.

దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టతలకు గురవుతున్న సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితులలో మనం అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి వచ్చింది. అనేక పరిమితులను మనం దాటిపోలేము. మన చుట్టూ అలుముకున్న పరిస్థితుల నేపథ్యంలో మన రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్ర మేథోమధనం చేసి, అనేక మంది ఆర్థిక గణాంక నిపుణులతో చర్చించి, నిర్థారణ చేసుకున్న వాస్తవిక దృక్పథంతో 2019-20 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది. ఆర్థికశాఖ అందించిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన బడ్జెట్ ను తమ అనుమతితో నేను సభ ముందు ప్రవేశ పెడుతున్నాను.

గతంలో ప్రవేశపెట్టబడ్డ కేంద్ర, రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంటులలో సమర్పించిన అంచనాలకు, నేడు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నాటికున్న పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం వచ్చింది.భారత ప్రభుత్వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం… కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 22.69 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే, 2019-20 మొదటి త్రైమాసికంలో కేవలం 1.36 శాతం మాత్రమే వృద్ధి సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం 15 శాతం ఆదాయాభివృద్ధి సాధ్యమని ఆశించాము. కానీ రాష్ట్రంలో కేవలం 5.46 శాతం ఆదాయ వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది.

గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం వాణిజ్య పన్నుల విభాగంలో 13.6 శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కేవలం 6.61 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధించగలిగింది. ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో కేవలం 2.59 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరం వరకు 19.8 శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే, ఈ ఏడాది మొదటి నాలుగు నెలలు 17.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. మోటార్ వెహికల్ ట్యాక్స్ లో ఆదాయం మరింత దారుణంగా పడిపోయింది. గడిచిన ఐదేళ్లలో మోటారు వాహనాల పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో 19 శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మైనస్ 2.06 శాతానికి పడిపోయింది.

రాష్ట్రంలో పన్నేతర ఆదాయం (నాన్ ట్యాక్స్ రెవెన్యూ)లో కూడా భారీ తగ్గుదల నమోదైంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో గత ఆర్థిక సంవత్సరం వరకు 14.9 శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే, ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో మైనస్ 14.16 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధ్యమైంది. మొత్తంగా పన్నేతర ఆదాయం 29 శాతం తగ్గింది. ఈ దుస్థితి ముమ్మాటికీ ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావమే.

రాష్ట్రానికి స్వీయ ఆదాయంలో వచ్చిన తగ్గుదలతో పాటు పన్నుల్లో వాటా చెల్లించే విషయంలో, నిధుల బదలాయింపులో కూడా కేంద్ర ప్రభుత్వం కోత పెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్నుల్లో వాటా (DEVOLUTION) కింద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో 4.19 శాతం కోత పెట్టింది. మిగతా అన్ని విషయాల్లో కూడా ఇలాగే కోత విధించడం ద్వారా మన రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగింది.

తెలంగాణ కొంతలో కొంత నయం:
————————————-
దేశంలోని చాలా రాష్ట్రాల పరిస్థితి మనకంటే మరింత అద్వానంగా ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక ప్రకారమే… కర్ణాటక, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలు మైనస్ ఆదాయాభివృద్ధి రేటును నమోదు చేసుకుంటూ తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చిచూసినప్పుడు తెలంగాణ పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్నట్లు కొంతలో కొంత నయంగా కనిపిస్తున్నది. స్థిరమైన ఆర్థిక ప్రగతి, పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన పరపతితో ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకోగలుగుతున్నది. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులకు లోబడి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరిస్తున్నది. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఆర్థిక సంస్థలు, మూలధన వాటాను కలిపి ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల నిర్మాణం యధాతథంగా కొనసాగుతుందని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నాను.

ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని,రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికున్న చిత్త శుద్ధికి నిదర్శనం, రైతుబంధు పథకం కింద ఎకరానికి ఇస్తున్న సహాయాన్ని
రూ. 8000 నుండి రూ. 10,000 కు పెంచడమే. రైతుబంధు పథకం యధాతధంగా కొనసాగుతుందని రాష్ట్ర రైతు లోకానికి నేను మనవి చేస్తున్నాను.రైతుబంధు పథకం కోసం ఈ బడ్జెట్లో 12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. అదే విధంగా రైతు బీమా పథకాన్ని కూడా ప్రభుత్వం యధాతధంగా కొనసాగిస్తుంది. రైతుబీమా ప్రీమియం చెల్లించడం కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1,137 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు రైతుల పంటరుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట రుణాల మాఫీ కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. రైతులకు వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ యధాతధంగా కొనసాగుతుంది. నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడానికయ్యే విద్యుత్ బిల్లుల భారం రైతులపై వేయకుండా తామే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల కోసం చేసే వ్యయం పెరిగింది. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సబ్సిడీల కోసం 8,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నది.

పేదలకు అందించే ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కళ్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆరు కిలోల బియ్యం లాంటి పథకాలకు ఎలాంటి నిధుల కొరత రానీయమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను.

పేదలకు కనీస జీవన భద్రత కల్పిస్తున్న ఆసరా పెన్షన్ల లబ్ధిని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రెట్టింపు చేసింది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, నేత – గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల పెన్షన్ ను 1,000 రూపాయల నుంచి 2,016 రూపాయలకు ప్రభుత్వం పెంచింది. వికలాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్ను 1,500 రూపాయల నుంచి 3,016 రూపాయల వరకు పెంచి, అందిస్తున్నది. ఆసరా పెన్షన్ల ప్రయోజనాలు మరింత విస్తృత పరిధిలో అందించడం కోసం ప్రభుత్వం మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది. వృద్దాప్య పెన్షన్ వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించింది. త్వరలోనే 57 సంవత్సరాలు నిండిన వారందరికీ వృద్దాప్య పెన్షన్ లభిస్తుంది. బీడీ కార్మికుల పిఎఫ్ కటాఫ్ డేట్ ను కూడా ప్రభుత్వం తొలగించింది. ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్లో 9,402 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.

విద్యార్థులకు మంచి వసతి, భోజనం కల్పిస్తూ ఇంగ్లీషు మీడియం విద్య అందిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం యధావిధిగా కొనసాగిస్తుంది. గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన మిగతా హామీలను కూడా ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తుంది.

కేంద్ర పథకాల అమలు కోసం మన రాష్ట్రానికి వస్తున్న నిధుల విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియ చేయదలుచుకున్నాను. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న వివిధ రకాల పన్నుల ద్వారా మన రాష్ట్రం నుంచి గత ఐదేళ్లలో కేంద్రానికి అందిన మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వం దృవీకరించిన గణాంకాల ప్రకారమే 2,72,926 కోట్ల రూపాయలు. ఈ నిధుల్లో అన్ని రాష్ట్రాలకు వచ్చిన విధంగానే, కేంద్ర పథకాల అమలుకోసం మన రాష్ట్రానికి 31,802 వేల కోట్ల రూపాయలు వచ్చాయి.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను మన రాష్ట్రానికి ఇవ్వాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీని ప్రకారంగా ఏడాదికి ఇచ్చే రూపాయలు 450 కోట్లలో కూడా, ఇంకా ఒక ఏడాది నిధులను కేంద్రం ఇవ్వలేదు.

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రకారమే, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కోసం గడిచిన ఐదేళ్లలో అక్షరాలా 5,37,373 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అందులో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం రాష్ట్రానికి అందిన నిధులు కేవలం 31,802 వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేస్తున్నాను. అంతకు మించి ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రానికి అందలేదని సభ్యులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.

కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రజలకు మేలు చేయగలవని భావించిన కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని పథకాల కోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేయదలచుకోలేదని విస్పష్టంగా ప్రకటిస్తున్నాను. ఉదాహరణకు మన రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ కన్నా ఎంతో విశిష్టమైనది. ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి 1,336 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. కానీ ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి 250 కోట్ల రూపాయల విలువైన వైద్య సేవలు మాత్రమే అందుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందవు. ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ పథకం ఎన్నోరెట్లు మెరుగైనది కాబట్టి మనం కేంద్ర పథకాన్ని వద్దనుకున్నాం. ప్రతీ కేంద్ర ప్రభుత్వ పథకం విషయంలో ఇలాగే ఆలోచించి, ప్రజల మేలు కాంక్షించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను.

పరిపాలనా సంస్కరణలు:
—————————–
స్వరాష్ట్రంలో సుపరిపాలన నినాదంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిపాలనా సంస్కరణలు అమలు చేస్తున్నది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం, సరైన పర్యవేక్షణతో పారదర్శక పాలన అందించడం కోసం ప్రభుత్వం పరిపాలనా విభాగాలను పునర్ వ్యవస్థీకరించింది. గతంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్లను 69 కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం. గతంలో కేవలం 68 మున్సిపాలిటీలుంటే, వాటి సంఖ్యను 142 కు పెంచుకున్నాం. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, కార్పొరేషన్ల సంఖ్యను 13 కు పెంచుకున్నాం. మారుమూల పల్లెలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా చేసుకున్నాం. గతంలో 8,690 గ్రామ పంచాయతీలుంటే, ఇప్పుడు తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి.

పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త విభాగాలను ఏర్పాటు చేసింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లా పంచాయతీ అధికారుల కార్యాలయాలుండేవి. వాటి సంఖ్యను 32 కు ప్రభుత్వం పెంచింది. ప్రతీ రెవెన్యూ డివిజన్ కు ఒక డి.ఎల్.పి.ఓ. ఉండాలనే లక్ష్యంతో 28 డి.ఎల్.పి.ఓ ల సంఖ్యను 68 కు పెంచింది. గతంలో 438 మంది ఇ.ఓ.పి.ఆర్.డీలుంటే, ఇప్పుడు మండల పంచాయతీ అధికారిగా మార్చిన ఇ.ఓ.పి.ఆర్.డీ పోస్టులను 539 కి ప్రభుత్వం పెంచింది.

శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత పటిష్టంగా అమలయ్యేందుకు పోలీసు వ్యవస్థను కూడా ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. కొత్తగా 7 పోలీసు కమీషనరేట్లను ఏర్పాటు చేసి, ప్రభుత్వం వాటి సంఖ్యను 9 కి పెంచింది. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163 కు పెంచింది. సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717 కు పెంచింది. కొత్తగా 102 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ల సంఖ్యను 814 కు పెంచింది.

స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు దక్కాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చట్టం చేసి, కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా పొందింది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతాయి.

కొత్త చట్టాలు:
—————-
ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కేవలం డబ్బులు ఖర్చు చేయడం వల్ల మాత్రమే సాధ్యం కాదు. ఎన్ని కోట్లు వెచ్చించినా జరగని మార్పు, ఒక మంచి విధానం తీసుకురావడం వల్ల సాధ్యమవుతుంది. తెలంగాణ గ్రామాలు, పట్టణాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానం, సమగ్ర పట్టణ విధానం తీసుకొచ్చింది. కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలను అమలు చేస్తున్నది. ప్రభుత్వం ఇటీవలే కొత్త పంచాయతీ రాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేని, అవినీతికి ఆస్కారం లేని, పారదర్శకంగా సేవలందించే కొత్త రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నది.

పరిపాలనా వ్యవహారాల్లో ఎవరి బాధ్యత ఏమిటనే విషయంలో చట్టంలో స్పష్టమైన నియమ, నిబంధనలున్నాయి. స్థానిక సంస్థల అధికారాలు, విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఏర్పడింది. ఒక వేళ ఎవరైనా విధి నిర్వహణలో విఫలమైతే, వారిని ఆ బాధ్యతల నుంచి తొలగించే అధికారం కూడా ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి ఉంటుంది.

కొత్త పంచాయతీ రాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల ద్వారా గ్రామాలు, పట్టణాలలో ఉన్నతస్థాయి సేవలు అందాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. కొత్త చట్టాల వల్ల నిశ్చయంగా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలలో బాధ్యతాయుత వైఖరి రావాలని ప్రభుత్వం కోరుతున్నది. ఈ సంస్కరణల ఫలితంగా గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతితో పట్టణాలు తయారు కావాలని, ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవనం లభించాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం కోసం ఈ నెల 6 నుంచి గ్రామాల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రారంభమయింది. పచ్చదనం పెంచడం, పరిశుభ్రత కాపాడడం, నియంత్రిత పద్ధతిలో నిధులు ఖర్చు చేయడం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం, గ్రామ అవసరాలకు తగ్గట్టు బడ్జెట్ రూపకల్పన, విద్యుత్ సంబంధ సమస్యలు పరిష్కరించుకోవడం తదితర పనులు ప్రజల విస్తృత భాగస్వామ్యంతో జరిపించాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను ఈ సందర్భంగా కోరుతున్నాను.

పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం:
—————————————–
పంచాయతీ రాజ్ శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని ఖాళీలను వేగంగా భర్తీ చేస్తున్నది. చాలీ చాలని వేతనాలతో అవస్థలు పడుతూనే గ్రామ పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న, రాష్ట్రంలోని 36 వేల మంది సఫాయి కర్మచారుల వేతనాలను 8,500 రూపాయలకు ప్రభుత్వం పెంచింది. పెరిగిన జీతాల వల్ల సఫాయి కర్మచారులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి కనీస భృతితోపాటు, సమాజంలో గౌరవం కూడా పెరగడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను.

స్థానిక సంస్థలకు నిధులు:
——————————
స్థానిక సంస్థలకు నిధుల కొరత రానీయకుండా ప్రభుత్వం కట్టు దిట్టమైన విధానం తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక సంఘం ఎన్ని నిధులిస్తే అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున జమ చేసి, స్థానిక సంస్థలకు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు తెలంగాణలోని గ్రామ పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమచేస్తుంది. ఈ రెండింటిని కలపి గ్రామ పంచాయితీలకు ప్రతీ నెల 339 కోట్ల రూపాయలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇప్పటికే గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. ఇదే తరహాలో పట్టణాలకూ నిధుల ప్రవాహం ఉంటుంది. ఆర్థిక సంఘం నిధులతో పాటు ఉపాధి హామీ పథకం నిధులు, పన్నులతో పాటు వివిధ రకాలుగా గ్రామ పంచాయతీలకు సమకూరే ఆదాయం కూడా స్థానిక సంస్థలకుంటుంది. కాబట్టి స్థానిక సంస్థలకు ఇక ఎలాంటి నిధుల కొరత ఉండదు. గ్రామ పంచాయితీలకు 2,714 కోట్ల రూపాయలను, మున్సిపాలిటీలకు 1,764 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.

విద్యుత్తు సంస్థలకు ఆర్థిక సహకారం:
——————————————
45. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఎప్పటికప్పుడు తగిన ఆర్థిక సహకారం అందిస్తున్నది. రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ రంగానికున్న ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం, ఖర్చుకు వెనుకాడకుండా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచింది. రైతులకు ఉచిత విద్యుత్తు అందించడం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 20,925 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు చెల్లించింది. ఉదయ్ పథకం ద్వారా డిస్కమ్ లకున్న 9,695 కోట్ల రూపాయల రుణభారాన్ని ప్రభుత్వమే భరించింది. విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయిపడిన 5,772 కోట్ల రూపాయలను ప్రభుత్వమే చెల్లించింది. గరిష్ట డిమాండ్ వచ్చినప్పుడు జరిపే అదనపు విద్యుత్ కొనుగోళ్లకు అయ్యే వ్యయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వమే భరిస్తున్నది. మొత్తంగా గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 42,632 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడం వల్ల పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ప్రగతి సూచికల్లో అతి ప్రధానమైన తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సగర్వంగా ఈ సభకు తెలియ చేస్తున్నాను.

ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవడానికి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. నిజానిజాలను స్పష్టంగా, స్ఫటిక సదృశ్యంగా సభ ముందు, సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాం. దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం కారణంగా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గిన మాట కఠిన వాస్తవం. దీని కారణంగా అనేక ఒడిదొడుకులు ఎదురైన విషయం కూడా అంతే వాస్తవం. ఈ కఠిన వాస్తవాల ప్రాతిపదిక ఆధారంగానే ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసింది. సరైన ఆర్థిక నిర్వహణ జరగాలని ప్రభుత్వం అభిలషిస్తున్నది. ముందుగా అన్ని శాఖల్లోనూ ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ బడ్జెట్లో తగిన కేటాయింపులు చేసింది. బకాయిలు చెల్లించిన తర్వాతే, కొత్త పనులు చేపట్టాలనే విధాన నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకున్నది. దీనికి అనుగుణంగానే ఆయా మంత్రిత్వ శాఖలు పరిమితులకు లోబడి, ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధులు ఖర్చు చేయాలని మంత్రులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ స్పష్టమైన సూచనలు చేసింది.

బడ్జెట్ అంచనాలు 2019-20:
———————————–
2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,82,017 కోట్ల రూపాయలను ప్రతిపాదిత వ్యయంగా ఓట్ ఆన్ అకౌంటులో ప్రభుత్వం అంచనా వేసింది. కానీ దేశంలో గడిచిన 18 నెలలుగా ఆర్ధిక మాంద్యం స్థిరంగా కొనసాగుతుంది. స్థూల దేశీయోత్పత్తి బాగా పడిపోయింది. అన్ని ప్రధాన రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఆదాయాలు పడిపోయాయి. దేశ ఆర్థిక పరిస్థితి ప్రభావం రాష్ట్రంపై కూడా పడింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం 1,46,492.30 కోట్ల రూపాయలు కాగా, ఇందులో రెవెన్యూ వ్యయం 1,11,055.84 కోట్ల రూపాయలు కాగా, మూలధన వ్యయం 17,274.67 కోట్ల రూపాయలు. బడ్జెట్ అంచనాలలో మిగులు 2,044.08 కోట్ల రూపాయలు కాగా, ఆర్థిక లోటు 24,081.74 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక ధోరణులను స్థూలంగా మీతో పంచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను, లక్ష్యాలను ఈ సభ ముందుంచాను. ఆయా శాఖలకు జరిపిన కేటాయింపులు, ఇతరత్రా విషయాలన్నింటినీ బడ్జెట్ ప్రతుల్లో సవివరంగా గౌరవ సభ్యులకు అందచేయడం జరిగింది. ఈ వివరాలను ఆర్థిక శాఖ వెబ్ సైట్ finance.telangana.gov.in లో కూడా ప్రభుత్వం పొందుపరిచిందని గౌరవ సభ్యులకు తెలియచేస్తున్నాను.

ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ పరిస్థితిలో తప్పక మార్పు వస్తుందనే ఆశాభావం నాకున్నది. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి, ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు కూడా మనకు ఉంది.

దురాక్రమణకు, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను కాపాడడానికి, కోర్టుల్లో మగ్గుతున్న భూ వివాదాలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన రాజీలేని న్యాయ పోరాటాలు ఫలిస్తున్నవి. చేజారిపోతాయనుకున్న వేల కోట్ల రూపాయల విలువైన భూములపై ఇప్పుడు ప్రభుత్వానికి హక్కు కలిగింది. ఈ భూములను దశల వారీగా విక్రయించడం వల్ల రాష్ట్రానికి అదనంగా ఆదాయం సమకూరుతుంది. ఆలా సమకూరిన ఆదాయాన్ని ఎస్.డి.ఎఫ్.కు కేటాయించి, ప్రజల అవసరాలు తీర్చే విషయలో ఏ శాఖలో ఇబ్బంది కలిగినా, సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆదాయ వనరులను బట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటూ, సవరించుకుంటూ క్రియాశీలకంగా (డైనమిక్ గా) వ్యవహరిస్తుందని ఈ సభకు, ఈ సభ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాను.

ముగింపు:
————-
ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ, అత్యంత ప్రధానమయిన వ్యవసాయ రంగానికి, ప్రజా సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా రైతులు, పేదల జీవితాల్లో వెలుగు తీసుకురావాలనే మా చిత్తశుద్ధిని మరోసారి వెల్లడిస్తున్నాను. పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలు కళకళలాడాలని, పట్టణాలు ప్రణాళికా బద్ధంగా ప్రగతి సాధించాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. అన్ని రంగాల్లో శీఘ్రగతిన అభివృద్ధి సాధించే దిశలో ఈ బడ్జెట్ దోహద పడుతుందని ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది.

పూర్తి ఆశావహ దృక్పథంతో, వాస్తవిక పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని, ఎన్నికల హామీలను నెరవేరుస్తూ, 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశ పెడుతున్నాను.

సమతుల అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతిపాదనలను ఆమోదించవలసిందిగా గౌరవ సభ్యులను సవినయంగా కోరుతున్నాను.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat