ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆశావర్కర్లకు వేతనాల పెంపు, పేదలకు సన్నబియ్యం, రైతన్నలకు పెట్టుబడిసాయం.. అమ్మఒడి పథకం కింద చదువుకునే పిల్లల తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000/- ఇలా రోజుకో నిర్ణయం తీసుకుంటూ..దేశంలోనే బెస్ట్ సీఎంగా దూసుకుపోతున్నారు. ఏడాది పాటు సాగిన సుదీర్ఘ ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. తాజాగా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఓ నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. త్వరలోనే నాడు – నేడు కార్యక్రమం ద్వారా 44, 512 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం తెలిపారు. తాజాగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం జగన్..రానున్న విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ స్కూళ్లలో ఒకటవ తరగతి నుండి 8th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడీయం విద్యను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఇక ప్రతి మండలానికి ఓ జూనియర్ కాలేజీ ఉండేలా చూడాలని, కాలేజీలు లేని మండలాల్లో వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో కనీస వసతులు లేకుండా ఉండడం పద్దతి కాదని..ఇక నుంచి సరైన మౌలిక సదుపాయాలు ఉంటేనే అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి మండలానికి ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని, నారాయణ విద్యా సంస్థలకు మేలు కలిగేలా చంద్రబాబు మండలాల్లో ప్రభుత్వ కాలేజీ లేకుండా చూశాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత మండలానికో ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు చేస్తుండడంతో నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలకు కాలం చెల్లినట్లే అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు అంటున్నారు. మొత్తంగా సీఎం జగన్ నిర్ఱయంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి వైయస్ లాగా.. జగన్ది కూడా మాట తప్పని, మడమ తిప్పని నైజం అని..ఒక్కసారి మాట ఇచ్చాడంటే..అది నెరవేర్చేవరకు నిద్రపోడని ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.