భారతీయుల నెరవేరని కలగా చెప్పబడుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మన సైనిక దళాలు రెడీగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బీసీపీ రావత్ గురువారం స్పష్టంచేశారు. పీవోకేను భారత్లో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనికచర్యకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శత్రుదేశం అయిన పాకిస్తాన్ నుంచి పీవోకేను సాధించడమే భారతదేశ తదుపరి అజెండా అంటూ రావత్ తేల్చిచెప్పారు.
ఈనిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. పీఓకే స్వాధీనం దిశగా కేంద్ర అనుమతికోసం వేచి చూస్తున్నామని, ఆ ఆదేశాలు రాగానే ఆపరేషన్ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా దేశంలోని వ్యవస్థలన్నీ పనిచేస్తాయని దానికి సైన్యం కూడా సిద్ధంగా ఉందన్నారు. అలాగే పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం తదుపరి భారత్ అజెండా అంటూ గతంలోనే కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 1994లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన తీర్మానంలోనూ ఈవిషయం పొందుపరిచారని ఆయన తెలిపారు.