ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఆత్మహత్యపట్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రగాఢ సంతాపం తెలిపాయి. అయితే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కోడెలపై వరుసగా కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానల్స్ అన్నీ కోడెలను ప్రభుత్వమే బలితీసుకుందంటూ వైసీపీపై అసత్యకథనాలు ప్రసారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోడెల ఆత్మహత్యపై బీజేపీ నేత పురిగళ్ల రఘరాం స్పందించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరువల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకి వెళితే. గత కొంత కాలంగా కోడెల రాజకీయంగా విషమ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. గత ఐదేళ్ల బాబు సర్కార్ హయాంలో ఆయన కొడుకు, కూతురు చేసిన అవినీతి, కేట్యాక్స్ వసూళ్ల దందా కోడెలకు తలవంపులు తెచ్చాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి కోడెల ఫ్యామిలీపై కేసులు పెట్టారు. దీంతో హైకోర్ట్ కూడా కోడెలను, ఆయన కొడుకును పోలీసుల ముందు లొంగి పొమ్మని ఆదేశాలు జారీ చేసింది. ఇక అసెంబ్లీ ఫర్నీఛర్ తరలింపు విషయ రాజకీయంగా రచ్చ అయింది. దీంతో కోడెల స్వయంగా తన తప్పును అంగీకరించినా..ఈ ఘటనపై కూడా కేసు నమోదు అయింది. దీంతో కోడెల రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే కోడెల ఇంత ఇబ్బందుల్లో ఉన్నా..చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో కోడెలను సొంత పార్టీ నేతలతోనే తప్పు పట్టించాడు. అంతే కాకుండా పార్టీ నుంచి కోడెల ఫ్యామిలీని సస్పెండ్ చేస్తున్నారంటూ వార్తలు లీక్ చేయించాడు. దీంతో చంద్రబాబు తీరుతో కోడెల తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. ఇదే విషయాన్ని తనకు ఫోన్ చేసి పంచుకున్నారని బీజేపీ నేత రఘురాం తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో..చంద్రబాబు తీరువల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని రఘురాం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొద్ది రోజుల క్రితం తనకు కోడెల స్వయంగా ఫోన్ చేసి.. చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని బాధపడ్డారని రఘురాం చెప్పారు. పార్టీకి కట్టుబడి నిజాయితీగా పని చేసినవారికి బాబు నాయకత్వంలోని టీడీపీలో విలువలేదని కోడెల ఆవేదన చెందారని రఘురాం చెప్పారు. పార్టీలో తనను ఒంటరిని చేశారని…తన మనసు ఎంతగానో గాయపడిందని..ఇక టీడీపీలో ఉండలేనని, బీజేపీలోకి వస్తానని, త్వరలోనే అమిత్షాను కలుస్తానని కోడెల చెప్పారని..కానీ ఇంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని బీజేపీ నేత పురిగళ్ల రఘురాం పేర్కొన్నారు. మొత్తంగా రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే సహకారం అందించకపోగా…తనను అవినీతిపరుడిగా, దొంగగా, సొంత పార్టీ నేతలతోనే తిట్టించడం, సస్పెండ్ చేస్తానని అవమానించేలా చంద్రబాబు మాట్లాడడం…కోడెలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. దీంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగిన సందర్భంలో చంద్రబాబు తీరు వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని బీజేపీ నేత రఘురాం చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరుకున పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.