బలహీన వర్గాలకు చెందిన వారికి ఉద్యోగాలు లభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని కల్పించిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఈ క్రమంలో గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహించి లక్షా 25 వేలమందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంటే టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు, అవినీతి జరిగిందంటూ చంద్రబాబు సీఎంకు లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబూ.. ‘మీరు సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా ఏపీపీఎస్సీ ద్వారా లక్ష ఉద్యోగాలకుపైగా భర్తీ చేసిన దాఖలాలున్నాయా?’ అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే లక్షా 27వేల ఉద్యోగాలు భర్తీ చేయడం ఒక్క జగన్ విశ్వసనీయతోనే సాధ్యపడిందన్నారు. చంద్రబాబు పాలన అంతా కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్, ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేయడంతోనే సరిపోయిందన్నారు. మీడియా ఎన్ని కుట్రలు పన్నినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్ జగన్ ఉంటే ఉంటారన్నారు.. ప్రజలకు మేలు చేసేందుకు జగన్ గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారని, నిరుద్యోగులకు భరోసా కల్పించే ఈ నిర్ణయాన్ని టీడీపీ నాయకులు సానుకూలంగా తీసుకోలేక పోతున్నారన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో మొదటి ర్యాంక్ వస్తే చంద్రబాబు, అతని అనుకూల మీడియా పెద్దలు తట్టుకోలేక పోతున్నారని, కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.