తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 నుంచి అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడు మలయప్పస్వామిగా తొమ్మిదిరోజులపాటు ఒక్కో రోజు ఒక్కోవాహనం పై భక్తులకు దర్శనం ఇస్తాడు. పెద్దశేషవాహనం, చిన్నశేషవాహనం, సింహపువాహనం, ముత్యపుపందిరి వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, గరుడవాహనం, హనుమంతవాహనం, స్వర్ణరథం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, పల్లకీ ఉత్సవం..ఇలా రోజుకో వాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులకు కనువిందు చేస్తారు. అయితే బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు జరిగే గరుడ వాహనసేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుత్మంతుడు. గరుడిని స్వామివారి తొలిసేవకుడిగా, పరమభక్తుడిగా భావిస్తారు. అందుకే స్వామి బ్రహ్మొత్సవాలకు ముక్కోటి దేవతలకు గరుడుడు ఆహ్వానం పలుకుతాడు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన ఐదవ రోజైన పంచమి నాడు శ్రీనివాసుడు గరుడ వాహనంపై విహరిస్తాడు. ఉత్సవమూర్తికి, గర్భగుడిలోని వేంకటేశ్వర స్వామికి భేదంలేదని చెప్పడానికే, నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ హారంతోపాటు, మేల్చాట్ పట్టువస్త్రాలను ఉత్సవమూర్తికి అలంకరిస్తారు. స్వామివారి గర్భాలయంలోని ఆభరణాలను బయటకు తీసుకువచ్చి వాహనసేవలో ఉపయోగించడమేనేది ఒక్క గరుడ వాహనసేవ రోజు మాత్రమే జరుగుతుంది.
ఈ గరుడోత్సవంలో స్వామి ఒక్కరే పాల్గొంటారు. అమ్మవారు ఉండరు. శ్రీ విల్లి పూత్తురు నుండి తీసుకువచ్చిన గోదాదేవికి అలంకరించిన పూలమాలను గరుడవాహనంపై విహరిస్తున్న స్వామి వారికి అలంకరిస్తారు. స్త్రీ పురుషలలో ఎవరు ఎక్కువన్న లింగ భేధాలను శ్రీవారి భక్తులు విడనాడాలన్నదే ఇందులోని అంతరార్థం. ఇక ప్రతి ఏటా తిరుమలలో శ్రావణమాసంలో గరుడ పంచమని ఘనంగా నిర్వహిస్తారు. కొత్తగా పెండ్లి అయిన దంపతులు తమ వైవాహిక జీవితం కలకాలం సుఖదాయకంగా ఉండేందుకు, తమకు పుట్టే సంతానం గరుడునిలా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ‘గరుడపంచమి’ పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రసన్న వదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగే వేంకటేశ్వరుడిని దర్శించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో 5 వ రోజైన అక్టోబర్ 3న పంచమినాడు రాత్రి 7 గంటల నుండి 12 గంటలవరకు శ్రీవారు గరుడవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. సర్వకాల సర్వావస్థలందు తనను శరణు కొరిన భక్తులను రక్షించేందుకు శంఖ చక్రధారై గరుడుని అధిరోహించి సిద్ధంగా ఉంటానని నా పాదాలను ఆశ్రయించండి చెప్పడమే గరుడసేవలోని పరమార్ధం. చూశారుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు ఉన్న విశిష్టత ఏంటో..బ్రహ్మోత్సవాలకు వెళితే…సరిగ్గా 5 వ రోజు తిరుమలలో ఉండేలా ప్లాన్ చేసుకోండి. గరుడ వాహనంపై ఊరేగుతున్న శ్రీ వేంకటేశ్వరుడిని ఒక్కసారి కళ్లారా చూస్తే మన జన్మ ధన్యం అయినట్లే..