తెలంగాణవ్యాప్తంగా సెప్టెంబర్ 28, శనివారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు సాగే ఈ పూల పండుగ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగనుంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ సంబురాలు ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన అనంతరం ‘ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ‘ అంటూ ఆడిపాడారు. ఈ మేరకు బతుకమ్మ ఆడిన ఫోటోలు, వీడియోను కవిత తన ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా కాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 300కి పైగా ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. 33 జిల్లాల్లో నిర్వహించనున్న బతుకమ్మ సంబురాలపై శనివారం నాడు కవిత సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ముంబైతో పాటు అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్లతో పాటు మొత్తం 12 దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. మొత్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటేలా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 29, 2019