ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇక మీదట ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తూ విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మార్కాపురం ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవలే పాఠశాల్లో పేరెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మనబడి–మన బాధ్యత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, దీని ద్వారా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, బ్లాక్బోర్డ్స్, ప్రహరీల నిర్మాణం తదితర పనులు చేపడతామన్నారు. విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేసి భర్తీ చేస్తామన్నారు. నెలలో 1, 3వ శనివారాలను నో బ్యాగ్ డేగా పాటించి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా బడిలో చేరిన విద్యార్థులందరికీ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని, డ్రాప్ అవుట్స్ తగ్గిస్తున్నామని తెలిపారు.