విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూధర్మ ప్రచారయాత్ర ఉమ్మడివరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా సాగుతోంది. ఇవాళ ఆరవ రోజు స్వామివారు వరంగల్ నగరంలో, వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీ కాళీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని కాళీవిశ్వేరుడికి స్వామివారు స్వయంగా పూజలు నిర్వహించారు. అలాగే కాశీ నుండి నీటి బుడగ వస్తుందని ప్రతీతి కలిగిన ఆలయ ప్రాంగణంలోని కొలనును స్వామివారు సందర్శించారు. తదనంతరం సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్వామిజీ భక్తులకు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు, స్వామివారి ధర్మ ప్రచార యాత్ర కన్వీనర్, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.