విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా హిందూ ధర్మ ప్రచారయాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రారంభించారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీనవరాత్రుల ఉత్సవాల్లో స్వామివారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆరవ రోజు స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామలదేవికి పీఠపూజ, చండీపూజ, దుర్గా సప్తశతి సహిత పూజ, రుద్రాభిషేకం వంటి పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీస్సులు అందజేశారు. తదనంతరం సనాతన వైదిక ధర్మం గొప్పతనాన్ని గురించి వివరిస్తూ..ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలని , ఆధ్యాత్మిక జీవనంతో మానవుడికి ప్రశాంతత లభిస్తుందని ప్రవచించారు. ఈ పూజా కార్యక్రమాలలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుమారుడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ దంపతులు, కెప్టెన్ కుటుంబసభ్యులు, వరంగల్ నగర ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ధర్మప్రచారయాత్ర కన్వీనర్, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పర్యవేక్షించారు.