ఏపీ సీఎం జగన్ ప్రజారంజక పాలనపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ అధినేత ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ నెల్లూరులో వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ముందుగా రైతులందరికీ ప్రతి ఏటా రూ.12,500/- అందిస్తానని ప్రకటించిన సీఎం జగన్ ఇప్పుడు ఆ మొత్తానికి ఇంకో వేయి రూపాయలు పెంచి మొత్తం రూ.13,5000/- ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కూడా వైయస్ఆర్ రైతు భరోసాలో జత చేసింది జగన్ సర్కార్. ఈ ప్రధానమంత్రి కిసాన్ నిధి పథకం కింద ప్రతి ఏటా రైతన్నలకు రూ. 6000/- ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. దీంతో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇచ్చే రూ. 6 వేలకు మరో 7,500/- కలిపి, మొత్తంగా ప్రతి ఏటా రైతన్నలకు రూ.13,500/- ఆర్థిక సాయం అందజేయనుంది. అంటే ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి రైతన్నకు వైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా రూ. 13500/-ఆర్థిక సాయం అందుతుంది. ఇవాళ నుంచి అమలు కానున్న ఈ పథకానికి జగన్ సర్కార్ వైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధి పథకం అని సరికొత్తగా నామకరణం చేసింది.
కాగా వైయస్ఆర్ రైతు భరోసా పథకానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేరును జతచేయడం పట్ల ఏపీ బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని తనవిగా చెప్పుకోకుండా గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్కు ధన్యవాదాలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కేంద్ర పథకాలపై తన స్టిక్కర్లు అతికించి ప్రచారం చేసుకునేవాడని, కేంద్ర ప్రభుత్వం పథకాలన్నీ తాను అమలు చేస్తున్న పథకాలుగా ప్రచారం చేసుకునేవాడని ఎద్దేవా చేశారు. ఎల్ఈడీ బల్బుల సరఫరా మొదలుకుని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వరకూ ప్రతి పథకాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం తనవిగా చెప్పుకొనేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆఖరికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని, వాటిని అమలు చేసిన చంద్రబాబు.. తామే నిధులను మంజూరు చేసినట్లు చెప్పుకునేవాడని కాషాయనాథులు మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రధానమంత్రి పేరు పెట్టి అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని బీజేపీ నాయకులు అంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పు కునే చంద్రబాబు కంటే..45 ఏళ్ల యువముఖ్యమంత్రి జగన్ పరిణితి గల నాయకుడని, అందుకే వైయస్ఆర్ రైతు భరోసా యాత్ర పథకాన్ని తనదిగా ప్రచారం చేసుకోకుండా..పీఎం కిసాన్ నిధి పథకం అని పేరు పెట్టాడని..బీజేపీ నాయకులు అంటున్నారు.
నిజంగా సీఎం జగన్ పాలనలో పరిణితితో వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి వైయస్ఆర్ రైతు భరోసా పథకానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని కొత్తగా పేరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ చేయకపోయినా కేంద్రం నిలదీసి అడిగేదేం ఉండదు. అందుకే చంద్రబాబు నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు తన పేరు, స్టిక్కర్ అతికించుకుని ప్రచారం చేయించుకునేవాడు. కానీ జగన్ ఈ రైతు భరోసా పథకం కింద రైతన్నకు ఇచ్చే రూ.13500 /- లలో 6 వేలు కేంద్ర ప్రభుత్వ నుంచి అందుతుంది కాబట్టి నిజాయితీగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే కేంద్ర ప్రభుత్వ పథకం పేరును వైయస్ఆర్ రైతు భరోసా పథకంలో యాడ్ చేయించాడు. నిజంగా ప్రత్యర్థి పార్టీ అయినా జగన్ నీతి, నిజాయితీతో కేంద్ర ప్రభుత్వ పథకం పేరును వైయస్ఆర్ రైతు భరోసా పథకంలో చేర్చడంపై ఏపీ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనవి కాకపోయినా తనవిగా చెప్పుకుని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు ఎక్కడా…తనది అని చెప్పుకునే వీలున్నా..నిజాయితీగా ప్రత్యర్థులకు సైతం పేరువచ్చేలా చేసిన జగన్ ఎక్కడా అని కమలనాథులు అంటున్నారు.ఇది చూస్తే మిర్చిసినిమాలో క్లైమాక్స్ డైలాగ్ గుర్తుకువస్తుంది. ఏం గుండెరా అది..శత్రువు ప్రాణం కత్తికింద ఉన్నా కూడా…ప్రేమిద్దాం అంటున్నాడంటే..ఏం గుండెరా వాడిది..ఆ గుండె బతకాలి..పదిమందిని బతికిస్తది అన్న డైలాగ్ గుర్తుకువస్తుంది. పది మందికి మంచి చేయడమే కాకుండా..తనతోపాటు శత్రువులకు సైతం మంచి పేరు రావాలని..తపిస్తున్న జగన్లాంటి నాయకుడు..కలకాలం ఇలాగే పాలించాలని..ఏపీ ప్రజలు అంటున్నారు.మొత్తంగా వైయస్ఆర్ రైతుభరోసా పథకానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేరును జతచేర్చిన సీఎం జగన్ను ప్రత్యర్థి పార్టీలు సైతం శభాష్ అంటున్నారు.