ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా సోమవారం కలుసుకున్నారు. చిరంజీవి దంపతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ అక్కే ఉన్నారు. తరువాత జగన్ దంపతులు కారు వరకూ వచ్చి చిరంజీవి దంపతులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో చిరు మాట్లాడుతూ. సినిమా పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారని మెగాస్టార్ తెలిపారు. సినీ పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని ఆయన చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. సినీ పరిశ్రమకు ఏది కావాలన్నా తానెప్పుడూ ముందుంటానని వైఎస్ జగన్ చెప్పారన్నారు. ఏది కావాలన్నా అడగడానికి ఏ మాత్రం సంకోచించవద్దని అన్నారన్నారు. ఆయన సహాయం చేసే గుణానికి తనకు చాలా సంతోషమేసిందన్నారు. కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. సైరాను త్వరలోనే తప్పకుండా చూస్తానని చెప్పారని తెలిపారు. ఇకపోతే గత ప్రభుత్వం రెండేళ్లుగా నంది అవార్డులను ప్రకటిస్తున్నా వాటిని అందించలేదని ప్రస్తావించగా వెంటనే ఫంక్షన్ నిర్వహించేలా తమ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, కచ్చితంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అంటే.. ‘ఎనీ టైమ్ అన్నా ఖచ్చితంగా అందర్నీ కలుస్తాను. సమయం తీసుకొని ఏర్పాటు చేయండి’అని వైఎస్ జగన్ చెప్పారంట.