ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచుతున్న కోమటి చెరువు- మినీ ట్యాంకు బండ్ సుందరీకరణలో భాగంగా మరో కొత్తదనం ఆవిష్కృతం కానున్నది. కోమటి చెరువు బండ్ పై ప్రత్యేకమైన ఎగిరే నెమలి, సరస్సు నుంచి తన అర చేతుల ద్వారా మంచినీటిని తాగే బాలుడి ప్రతిమలతో కూడిన రెండు శిల్పాలను త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం బండ్ పై ఫినిక్స్ కంపనీ ప్రతినిధులతో కలియ తిరిగి శిల్పాలు ఏర్పాటు చేయాల్సిన అనువైన స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
– స్వర మయూరి (సింగింగ్ పికాక్ ): 15 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రతిమతో గాలిలోని తరంగాల ద్వారా సంగీత ధ్వనులు వినిపిస్తాయి. మ్యూజికల్ సింగింగ్ పికాక్ నెమలి పాడటం ట్యాంకు బండ్ పై ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది.
– తృష్ణ – లేక్ వద్ద బాలుడు తాగునీటి ప్రతిమ : 24 మీటర్ల ఎత్తులో 4 మీటర్ల వెడల్పుతో కోమటి చెరువులో అర చేతి ద్వారా మంచినీరు తాగే బాలుడి శిల్ప ప్రతిమ అందరిలో ఆలోచన కల్పిస్తుంది. ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉన్నామో.. చూపేలా నీటి వినియోగాన్ని, మనం ఆధారపడిన అన్నీ వనరులను విశ్వసించడం ఈ ప్రతిమ వెనుక ఉన్న ఆలోచనగా గౌరవంగా సూచిస్తుంది.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతో.. కోమటి చెరువు ప్రాంతాన్ని బ్యూటిఫుల్, వినోద భరితం., ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచడంతో పాటు మన భవిష్యత్ అభివృద్ధికి ఐకానిక్ గా సిద్ధిపేట నిలిచేందుకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఫినిక్స్ కంపనీ ప్రతినిధులు అవినాశ్, మోహన్, మున్సిపల్ ఇంజనీరు మహేశ్, తదితరులు పాల్గొన్నారు..