వచ్చే నూతన సవంత్సరంలో ఉగాది పండుగ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలాన్ని కేటాయించడానికి సిద్దమైంది. పేదలకు ఆ స్దలాల్లో ఇళ్లు నిర్మించడానికి జగన్ సర్కార్ ప్లాన్ చేసింది. అమరావతిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించి వాటిలో ఇళ్లు కట్టించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
రాష్ట్రవ్యాప్తంగా 20లక్షలమంది అర్హులను ఇప్పటికే గుర్తించింది ప్రభుత్వం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంలో నయా పైసా తీసుకోకుండా.. వందశాతం ఉచితంగా ఇంటి నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. ఇళ్ల నిర్మణానికి అవసరమైన భూసేకరణను కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. గ్రామ వాలంటీర్ల ద్వారా అర్హులైన వారిని ఇంకా గుర్తించి లబ్దిదారుల కిందకు చేరుస్తామని ప్రకటించింది ఏపీ సర్కార్.రాజశేఖర్ రెడ్డి హాయాంలో నిర్మించిన ఇళ్ల మరమ్మత్తులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.