సెప్టెంబర్ 15..రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత దుర్దినం..తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం కచ్చలూరు వద్ద పాపికొండలకు విహారానికి వెళ్లివస్తున్న రాయల్ వశిష్ట బోట్ సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది చనిపోగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 12 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో వారు చనిపోయినట్లు అధికారులు డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. కాగా బోటు ప్రమాదంపై వెల్లువెత్తిన విమర్శల దరిమిలా ప్రభుత్వం ముగినిపోయిన టీమ్ను వెలికితీస్తామని ప్రకటించింది. ఈ మేరకు ధర్మాడి సత్యం టీమ్కు బోటు వెలికితీత పనులను అప్పగించింది. గత కొద్ది రోజులుగా గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బోటు వెలికితీత పనులు ముందుకు సాగలేదు. పలు మార్లు బోట్ లంగర్ కొక్కేలాకు చిక్కినట్లే చిక్కి జారిపోయింది. ధర్మాడి సత్యం టీమ్తో పాటు, విశాఖ నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్కు చెందిన 10 మంది డీప్ వాటర్ మెరైన్ డైవర్లు మట్టి, బురదలో కూరుకుపోయిన బోటును వెలికితీసేందుకు ప్రయత్నించారు. అక్టోబర్ 21 సోమవారంనాడు బోటు ముందు భాగంలో ఉండే ప్లాట్ఫామ్, బోటు క్యాబిన్లోని కొంత భాగం, హైడ్రాలిక్ గేర్రాడ్, రెయిలింగ్లోని కొంత భాగం, బోటు టాప్పై ఉండే ప్లాస్టిక్ షీట్, బోటు నేమ్ బోర్డును బయటకు తీశారు. లంగర్లకు చిక్కినట్టే చిక్కి.. పట్టు జారటంతో బోటు మొత్తాన్ని బయటకు తీయడం వీలు కాలేదు. కాగా ఇవాళ బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్ల సాయంతో వెలికితీశారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బోటు బయటకు తీస్తుండగా అందులో నుంచి దుర్వాసన వస్తోంది. బోటులో ఉన్న మృతదేహాలు కుళ్లిపోవడం వల్లే దుర్వాసన వస్తోందని అధికారులు చెబుతున్నారు. మరికాసేపట్లో బోటును పూర్తిగా బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటు బయటపడడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే బోటులో ఉన్న మృతదేహాలన్నీ పూర్తిగా చిధ్రమయ్యాయి.దీంతో మృతులు ఎవరనేది గుర్తించడం కష్టంగా మారింది.